. విభజన సమస్యలపై అంశాలవారీగా చర్చ
. గంటన్నర పైగా తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా నిర్ణయాలు
. మంత్రులు, అధికారులతో రెండు వేర్వేరు కమిటీల ఏర్పాటు
. విలీన మండలాల్లో 5 గ్రామాలు కావాలన్న రేవంత్
. హైదరాబాద్లో ఏపీకి ప్రత్యేకభవన్ కోసం చంద్రబాబు ప్రతిపాదన
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విభజన చట్టంలోని అనేక అంశాల మధ్య గత పదేళ్లుగా పెండిరగ్లో ఉన్న సమస్యలను సానుకూల వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దాదాపు గంటా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో పది కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండిరగ్ సమస్యల పరిష్కారంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్ 9, 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్టు తెలిసింది. మొత్తానికి ఈ భేటీలో చర్చలు పూర్తి సానుకూల వాతావరణంలో కొనసాగాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య వున్న అస్తుల విభజన, వీలీన మండలాలు, ఐదు భద్రాచలంకు సంబందించిన ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ లో కొన్ని భవనాలు నేటికీ ఏపీ ప్రభుత్వ అధీనంలో వున్నాయి. వీటిని తమకు తిరిగి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయడి ముందు ప్రతిపాదించినట్లు తెల్సింది. అలాగే సమావేశంలో విభజన చట్టంలో పేర్కొన్న, పేర్కొనని సంస్థల అస్తుల పంపకాలతో పాటు ఏపీ ఫైనాన్షియల్ కార్పోరేషన్ అంశాలు, పెండిరగ్ విద్యుత్ బిల్లుల పై చర్చించారు. అలాగే విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించిన నేపథ్యంలో వాటి అప్పుల పంపకాలు, ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు సంబంధించి చెల్లింపుల పై కూడా చర్చ జరిగింది. వీటితో పాటు హైదరాబాద్లో వున్న మూడు భవనాలు ఏపీకి కేటాయించే అంశం, లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల విభజన అంశాల పై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ఏపీలో విలీనం చేసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు అప్పగించాలని చంద్రబాబు ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఇందులో ఏటిపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకుల పాడు పంచాయితీలను అడిగినట్లు తెలుస్తుంది. దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ వ్రాయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దిల్లీలో ఏపీ భవన్ తరహాలో హైదరాబాద్లో కూడా ఏపీ భవన్ ఒకటి ఉండాలని చంద్రబాబు ప్రతిపాదించగా, అందుకోసం స్థలం కేటాయింపుకు రేవంత్రెడ్డి అంగీకారం తెలియజేసినట్లు తెల్సింది. రెండు రాష్ట్రాల మద్య వున్న సమస్యలను పరిష్కరించేందుకు రెండు కమిటీలను వేయాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఇందులో అధికారులతో కూడిన కమిటీ ఒక్కటైతే, మంత్రులతో కూడిన కమిటీ మరొకటి వేయాలని నిర్ణయించారు. ఈ రెండు కమిటీల అధ్వర్యంలో పెండిరగ్ సమస్యలపై చర్చించి పరిష్కారమార్గాలు సూచిస్తే, మరోసారి మరలా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబుకు ‘నా గొడవ’ బహూకరణ
భేటీ ప్రారంభానికి ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరికొకరు.. బహుమతులు అందజేసుకున్నారు. చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు.. రేవంత్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించారు. అయితే భేటీలో రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు నా గొడవ పుస్తకాన్ని అందివ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం సలహాదారులు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.