కుప్పకూలిన ‘ప్రచండ’ సర్కారు
ఖాట్మండు: అస్థిర రాజకీయాలకు చిరునామాగా మారిన నేపాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ ఓటమిపాలయ్యారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం. మాజీ ప్రధాని కెేపీ శర్మ ఓలి నేతృత్వంలోని పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయినట్లయింది. నేపాల్ ప్రధానిగా డిసెంబర్ 25 2022లో ప్రచండ బాధ్యతలు చేపట్టారు. ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే మూడుసార్లు అవిశ్వాసం ఎదుర్కొన్నారు. అయితే, నేపాలీ కాంగ్రెస్తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ, అందుకు ప్రచండ నిరాకరించడంతో అవిశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, సీపీఎన్-యూఎంఎల్కు 78 మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలి బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్ ఇప్పటికే అంగీకరించినట్లు సమాచారం. మొత్తంగా నేపాల్లో గడిచిన పదహారేళ్లలో 13 ప్రభుత్వాలు మారడం అక్కడి రాజకీయ అస్థిరతను సూచిస్తున్నాయి.