. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కి.మీ రోడ్లు ధ్వంసం
. తక్షణ మరమ్మతులకు రూ.300 కోట్లు
. వెంటనే టెండర్లు పిలవాలని సీఎం చంద్రబాబు ఆదేశం
. కొత్త టెక్నాలజీతో రోడ్ల నిర్మాణం… ఐఐటీ ప్రొఫెసర్లతో సమీక్ష
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర రహదారులకు మోక్షం కలగనుంది. ధ్వంసమైన, గుంతలు పడి అధ్వాన్నంగా ఉన్న రహదారుల మరమ్మతులకు తక్షణమే టెండర్లు ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ఆయన శుక్రవారం సచివాలయంలో సమీక్ష చేశారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు. నాడు రోడ్ల మరమ్మతులపై కనీస మొత్తంలో కూడా నిధులు ఖర్చు చేయలేదని సీఎంకు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. దీంతో ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై పాత్ హోల్స్ (గుంతలు) సమస్య ఉందని అధికారులు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయని తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిథిలో తక్షణం పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. వీటి కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం అని తెలిపారు. గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైనా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. వెంటనే టెండర్లు పిలిచి అత్యవసర పనులు చేపట్టాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను ఏమాత్రం పట్టించుకోలేదని, దీంతో వాహనదారులు, ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు. ఈ పరిస్థితిని మార్చే పనులు తక్షణమే మొదలు కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సాంకేతిక అంశాలపై నిపుణులతో చర్చ, రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తిరుపతి ఐఐటీి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో, మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధనల వివరాలను సమీక్షలో సీఎంకు తెలిపారు. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా వివిధ రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. వర్షాకాలంలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికతపైనా నిపుణులు సాధ్యాసాధ్యాలను వివరించారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు పాల్గొన్నారు.
కాన్వాయ్ ఆపి వినతులు స్వీకరించిన సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి మరీ సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళుతున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ను ఆపారు. సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చిన ప్రజలను పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు ఈసందర్భంగా తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం వారి నుండి వినతిపత్రాలు తీసుకున్నారు. సీఎం స్వయంగా కారుదిగి వచ్చి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.