యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయ చంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: యుటిఎఫ్ ను బలపరిచి ఉద్యమాలకు ఊపిరి పోయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టిపీ జయ చంద్ర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని జడ్పీ హైస్కూల్ పోతుకుంట గ్రామ నందు వారు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల పరిధిలోని గోట్ళూరు, నాగలూరు, ధర్మపురి, రావులచెరువు, దర్శనమల తదితర గ్రామాలలోని పలు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో స్థానిక మండల నాయకులతో కలిసి ఉపాధ్యాయులను యుటిఎఫ్ సభ్యులుగా చేర్పించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలను విచ్ఛిన్నం చేస్తోందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల ఉనికికే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. కాబట్టి వెంటనే ఈ జీవోను రద్దుచేసి మూడవ, నాలుగవ, ఐదవ తరగతి లను ప్రాథమిక పాఠశాలలోకి తిరిగి విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు. అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ లక్ష్యాలతో కొనసాగుతున్న యుటిఎఫ్ స్థాపించబడి ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి కావించబడిందని, స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న యుటిఎఫ్ ఉపాధ్యాయులంతా బలపరచాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజీలేని పోరాటాలను కొనసాగిస్తూ, ప్రభుత్వ విద్యను పరిరక్షించడానికి, ఉపాధ్యాయుల హక్కులు సంక్షేమం కొరకు యుటిఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, జనార్దన్ బాబు తో పాటు నాయకులు వెంకట కిషోర్, హరికృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.