ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్యస్పందన
విశాలాంధ్ర – కర్నూలు బళ్లారి చౌరస్తా : సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం అన్న విధంగా మానవుని శరీరంలో పంచేంద్రియాలలో నయనం (కన్ను) ప్రధానమైనది. అలాంటి కళ్ళు లేని మానవ జీవితం అంధకారం అని సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు ప్రసాద్ శర్మ అన్నారు. బుధవారం సుందరయ్య స్ఫూర్తి కేంద్రం, భరత్ హాస్పిటల్ సౌజన్యంతో ఉజ్వల, ప్రగతి మహిళా ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ గెలాక్సీ స్కూల్ నందు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రసాద్ శర్మ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప అన్న విధంగా, అన్ని అవయవాల్లో కెల్ల కన్ను పాత్ర ప్రధానమైనదని తెలిపారు.
చూపు మందగించిన వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంధత్వం రాదని తెలిపారు. అలాగే కంటిలో శుక్లాలు వచ్చినట్లయితే ప్రభుత్వము ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేసేందుకు ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టిందని, తద్వారా ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని సూచించారు. సుందరయ్య భవన్ నందు ప్రతి రెండు నెలలకోసారి షుగర్ ,బిపి , మూర్చ, పక్షవాతం రోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రెండు నెలలకు సరిపడా మందులు కేవలం 200 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ వైద్య శిబిరాన్ని కూడా నగరంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ శిబిరంలో భరత్ హాస్పిటల్ ఆప్తాల మిస్ట్ రవి, తరుణ్, దేవరాజ్ లు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి సూచనలను అందించారు. ఈ శిబిరంలో ఉజ్వల, ప్రగతి మహిళా ఐక్య సంఘాల ఆర్పీలు రుద్రమ్మ ,జ్యోతి, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.