సీనియర్ సివిల్ జడ్జ్ గీత వాణి
విశాలాంధ్ర ధర్మవరం:: మోటార్ వాహన చట్టమును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని సీనియర్ సివిల్ జడ్జ్, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ గీతా వాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ రమ్య సాయి తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు మోటార్ వాహన చట్టం మాసోస్తవాల సందర్భంగా కోర్టు నుండి పట్టణంలోని పలు కూడలిలో జడ్జీలతోపాటు న్యాయవాదులు, పోలీసులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ టూ వీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా ఫోర్ వీలర్స్ లో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్టు తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపారు. ఇలా చేయడం వల్ల అనుకోకుండా ఏవేని ప్రమాదాలు జరిగితే తలకు దెబ్బ తగలకుండా రక్షణగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సెల్ ఫోన్ తో మాట్లాడి డ్రైవ్ చేయడం, మద్యం తాగి డ్రై చేయడం లాంటి పనులు చట్టరీత్యా నేరమని, అలా చేసిన ఎడల వాహనం నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు నడిపేందుకు అనుమతి ఇవ్వరాదని, అలా ఇచ్చినచో ట్రాఫిక్ నియమ నిబంధనలు తెలియని మైనర్లు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. నేడు జరిమాణాలు అత్యధిక మొత్తములో ఉన్నాయని, కావున నియమ నిబంధనలు తప్పక పాటించాలని, అప్పుడే ప్రాణాలు పదిలంగా ఉంటాయని తెలిపారు. ఈ మోటార్ వాహన చట్టం యొక్క అమలు తోపాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు జూలై నెల అంతా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యదర్శి గోపికృష్ణ, కోశాధికారి అబ్దుల్ తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పోలీసులు పాల్గొన్నారు.