. కలచివేసిన క్షేత్రస్థాయి పరిస్థితి
. బాధితుల్ని ఓదార్చేందుకు మాటలు రాలేదు
. నాన్నను కోల్పోయినప్పటి భావనే ఇప్పుడూ కలిగింది
. వయనాడ్లో పర్యటించిన రాహుల్, ప్రియాంక
న్యూదిల్లీ/తిరువనంతపురం : కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విలయానికి 277 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 240 మంది ఆచూకీ లేరు. కొండచరియలు విరిగి పడిన మూడో రోజైన గురువారం సహాయక, పునరావాస కార్యకలాపాలు కొనసాగాయి. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. అక్కడి పరిస్థితి తమను కలచివేసిందని ఇద్దరు నేతలు తెలిపారు. ఇది జాతీయ విపత్తు అని రాహుల్ అన్నారు. కొండచరియలు విరిగి పడి తమ ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి స్థితి బాధించిందన్నారు. కేరళలోని వయనాడ్కే కాదు మొత్తం దేశానికి ఇది ఘోర విపత్తు. నేనైతే దీనిని జాతీయ విపత్తు అనే అంటాను కానీ ప్రభుత్వం ఏమంటుందో చూద్దాం’ అని విలేకరుల ప్రశ్నలకు రాహుల్ సమాధానాలిచ్చారు. నాన్నను కోల్పోయినప్పుడు కలిగిన బాధే ఇప్పుడూ కలిగించిందని చెప్పారు. ‘తమ తోబుట్టువులు, తల్లులు, తండ్రులు, బిడ్డలను ఇక్కడి వారు కోల్పోయారు. వేలాది మంది బాధల్లో ఉన్నారు. బాధితులను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేద’ని ఆయన అన్నారు. రాజకీయ అంశాలు చర్చించేందుకు ఇది సమయం, సందర్భం కాదని రాహుల్ గాంధీ అన్నారు. తన దృష్టి రాజకీయాలపై లేదని, వయనాడ్ ప్రజలపై ఉన్నదని చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులు చాలా క్లిష్టమైనవిగా ఉన్నాయన్నారు. కొండచరియలు విరిగి పడిన చూరల్మాలా ప్రాంతాన్ని, ఓ ఆసుపత్రిని, మెప్పాడిలోని ఆరోగ్య కేంద్రాన్ని రాహుల్, ప్రియాంక సందర్శించారు. చూరల్మాలాకు వెళ్లిన ప్రియాంక, రాహుల్ అక్కడ చక్కతో ఏర్పాటు చేసిన తాత్కాలికంగా నడక మార్గంలో వెళుతూ బెయిలీ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షం, బురదను లెక్క చేయకుండా ఆ ప్రాంతంలో కలియతిరిగారు. ఆపై మృతదేహాలను భద్రపరిచిన డాక్టర్ మూపెన్ మెడికల్ కాలేజిని, మెప్పాడిలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ‘ఇక్కడి పరిస్థితిని తెలుసుకునేందుకు మేము వచ్చాం. సర్వం కోల్పోయిన వారిని చూస్తే చాలా బాధ అనిపించింది. తమ ఇళ్లు, కుటుంబ సభ్యులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో వారున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడటం కూడా కష్టమే. వారిని ఓదార్చేందుకు ఏ మాటలు రాలేదు… అసలు వాళ్లకు ఏం చెప్పి ఓదార్చాలో కూడా తెలియదు’ అని రాహుల్ అన్నారు. వయనాడ్ సందర్శన అనంతరం రాహుల్ ఫేస్బుక్ మాధ్యమంగానూ తన బాధను పంచుకున్నారు. ‘ఈ కష్టకాలంలో నేను, ప్రియాంక… వయనాడ్ ప్రజలకు అండగా ఉంటాం. పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తున్నాం. సహాయక, పునరావాస కార్యకలాపాల పురోగతిని గమనిస్తున్నాం. వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. అవసరమైన సహాయ సహకారాలు అవసరార్థులకు అందేలా చూస్తున్నాం. సాధ్యమైన సహాయ సహకారాలు అందించేందుకు యూడీఎఫ్ కట్టుబడి ఉంది. తరచూ ప్రకృతి విలయాలు, కొండచరియలు విరిగిపడే ఘటనలు చోటు చేసుకుంటుండటం ఆందోళనకరం. తక్షణమే సమగ్ర కార్యాచరణను రూపొందించుకోవడం అవసరం’ అని ఆయన పోస్టు చేశారు.
సహాయక చర్యలు ముమ్మరం
వయనాడ్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు కేరళ ప్రభుత్వ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఇప్పటికే 277కు చేరిందని, మరో 240 మంది ఆచూకీ లేరన్నారు. గల్లంతైన వారి సంఖ్య కచ్చితంగా చెప్పలేమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. ఇప్పటివరకు 256 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయిందని, 154 భౌతికకాయాలను జిల్లా యంత్రాంగానికి అప్పగించారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడిరచారు. నిలాంబుర్, పోతుకల్ నుంచి వెలికి తీసిన మృతదేహాలకూ శవపరీక్షలు పూర్తి చేసినట్లు తెలిపారు. భారత సైన్యం, నావికా దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. బెయిలీ వంతెన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయని అధికారులు చెప్పారు. కర్నాటక, కేరళ సబ్ ఏరియా, జనరల్ ఆఫీసర్ కమాండిరగ్, మేజర్ జనరల్ వీటీ మాథ్యూ మాట్లాడుతూ 500 మంది ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. కేరళ ప్రభుత్వానికి జులై 30వ తేదీ ఉదయం నుంచి సహకరిస్తున్నామన్నారు. 100కుపైగా మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. అనేక మందిని కాపాడామని చెప్పారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ వయనాడ్లోని సివిల్ స్టేషన్లోగల ఏపీజే అబ్దుల్ కలామ్ మెమోరియల్ హాల్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి తాజా పరిణామాలపై చర్చించారు. సహాయక చర్యల కోసం భారీ యంత్రాల తరలింపులో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లనూ సీఎం వివరించారు. బెయిలీ వంతెన నిర్మాణ పనుల గురించీ మాట్లాడారు.