. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ
. సత్యసాయి జిల్లాలో చంద్రబాబు చేతుల మీదుగా…
. సచివాలయ ఉద్యోగులకే విధులు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి/శ్రీసత్యసాయి: ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా సామాజిక పెన్షన్ల పంపిణీని సోమవారం విజయవంతంగా నిర్వహించారు. అన్ని జిల్లాల్లోను ఉదయం 5 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన ఉద్యోగులు ఇంటింటా వెళ్లి పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు జులై కింద మొత్తం 64,82,052 వేల మందిని ఎన్టీఆర్ భరోసా పెన్షనర్లకు అర్హులుగా గుర్తించి, వారి కోసం రూ.2737కోట్లను కేటాయించారు. ఒకే ఒక్క రోజులో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఆ మేరకు తొలిరోజు రాత్రి 7 గంటల వరకు 97 శాతం మందికిపైగా పెన్షన్లు అందజేశారు. అందుబాటులో లేనివారికి, వివిధ సాంకేతిక కారణాల రీత్యా నిలిచిన పెన్షన్దారులకు మంగళవారం ఇస్తారు. ఒక రోజు ముందుగానే సచివాలయ పూర్తిస్థాయి ఉద్యోగుల ద్వారా పెన్షన్ల సొమ్మును సమీప బ్యాంకుల నుంచి డ్రా చేయించారు. పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ దిశానిర్దేశం చేశారు. 26 జిల్లాల్లోని కలెక్టర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ వేగవంతంగా నిర్వహించారు. ఈ పంపిణీలో అగ్రస్థానంలో కృష్ణాజిల్లా, అట్టడుగున అల్లూరు జిల్లా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండో నెల(జులై)కు చెందిన పెన్షన్లను అర్హులైన అవ్వాతాతలకు రూ.4వేల చొప్పున అందజేశారు. కాగా ఈ నెలలోనూ పెన్షన్ల పంపిణీలో వలంటీర్లకు బాధ్యతలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ల పంపిణీ బాధ్యతల నుంచి వలంటీర్లను పూర్తిగా తొలగించింది. వారి స్థానంలో గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన పూర్తిస్థాయి ఉద్యోగులు పంపిణీ చేశారు. దీంతో ప్రతినెలా వలంటీర్ల విధులను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే నిర్వహించే అవకాశముంది. గ్రామ, వార్డు, సచివాలయల పరిధిలో ఉన్న వలంటీర్లను ఏం చేస్తారనేదీ ప్రశ్నార్థకంగా మారింది.
సత్యసాయి జిల్లాలో సీఎం పెన్షన్ పంపిణీ
శ్రీసత్యసాయిజిల్లా మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు స్వయంగా కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బులు అందజేశారు. అన్ని జిల్లాల్లోను మంత్రులు, ఎమ్మెల్యేలు పెన్షన్ల పంపిణీలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ముఖ్యమంత్రిగా తొలిసారి శ్రీ సత్యసాయి జిల్లా కు వచ్చిన సీఎంకు గుండుమలలో కార్యకర్తలు,అభిమానులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఓబులమ్మకు వితంతు పెన్షన్, పులమాసి రామన్న కు వృద్ధాప్య పెన్షన్ను చంద్రబాబుకు అందజేశారు. పెన్షన్ దారుల కష్టాలు విన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామన్న కు భూమి ఇవ్వడంతో పాటు, వారి బిడ్డలకు ఉపాధి కూడా కల్పిస్తామని, ఓబులమ్మకు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.
పెన్షన్ల పంపిణీ విజయవంతంగా సాగడం హర్షణీయం: పవన్
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పెన్షన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఈ రోజు ఉదయం నుంచీ ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించేలా సీఎం చంద్రబాబు రూపొందించిన కార్యక్రమం ప్రజలకు చేరువైంది. అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సీఎంను ఆయన అభినందించారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పవన్ పేర్కొన్నారు.