విశాలాంధ్ర – అనంతపురం : జంతలూరులోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతీయ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రక్తకేంద్రం సహకారంతో విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ విభాగాలు మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, సప్తగిరి సర్కిల్ శాఖ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడంతో కార్యక్రమంలో 75 మంది విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. వారి భాగస్వామ్యం రక్తదాన ప్రాముఖ్యాన్ని, ఆవశ్యకతను తెలియజేసింది. ఆసుపత్రి సిబ్బంది విశ్వవిద్యాలయం చేపట్టిన ఇటువంటి కార్యక్రమాలను, అందులో విద్యార్థినీ విద్యార్థులు చూపుతున్న సానుకూలతను గుర్తించి, ప్రశంసలను తెలియచేశారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో, సిబ్బందిలో సామాజిక బాధ్యత పెంపొందించడానికి సహకరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఉపకులపతి ఆచార్య ఎస్. ఎ. కోరి మాట్లాడుతూ… విద్యార్థులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సహకారాన్ని అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. రక్తదానం పట్ల వారు చూపిన సుముఖత ఎందరో జీవితాలలో మార్పును కలిగిస్తుంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర్రీయ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో ఇటువంటి సామాజిక కార్యక్రమాలను మరిన్ని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ బృందం, సమన్వయకర్త డాక్టర్ గరికిపాటి గురజాడ, నిర్వాహకులు డాక్టర్ దీపాంకర్ డే, డాక్టర్ శ్రేయ తదితరులు పాల్గొన్నారు.