ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో లో భయానక ఘటన వెలుగు చూసింది. బర్సాలోగో పట్టణంలో అల్ఖైదా , ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్రసంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వాల్ ముస్లిమిన్ మిలిటెంట్లు కిరాతకానికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని కాల్చిపారేశారు. ఆగస్టు 24న జరిగిన ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్లపై వచ్చిన ఉగ్రవాదులు కనిపించిన వారిని పిట్టల్లా కాల్చి చంపేశారు. మృతుల్లో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రాణ భయంతో ప్రజలు పరుగులు పెట్టినా వదిలిపెట్టలేదని.. వారిని వెంబడించి మరీ కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఘటన తర్వాత మృతదేహాలను సేకరించేందుకు స్థానిక అధికారులకు మూడు రోజుల సమయం పట్టినట్లు సదరు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తొలుత ఈ ఘటనలో 200 మంది మరణించినట్లు ఐరాస అంచనా వేసింది. కానీ, 600 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం. ఆర్మీ, టెర్రరిస్టులకు మధ్య 2015 నుంచి ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 20 వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.