విశాలాంధ్రగుంటూరు : వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జీఓ 39తో ఇచ్చిన క్యాలెండర్ రద్దు చేయాలని డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.80 లక్షల ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ ఐక్యవేదిక అధ్వర్యంలో గుంటూరులో సోమవారం నిరసనలు జరిగాయి. గుంటూరు ఏసీ కళాశాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కొల్లికొండ వెంకట సుబ్రమణ్యం మాట్లాడుతూ ఎన్నికల హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 1.80 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 36 పోస్టులు విడుదల చేయడం దారుణమన్నారు. 25 వేల మెగా డీఎస్సీ, 6 వేల పోలీసు కానిస్టేబుళ్లు, 2 వేల గ్రూప్
2, 3, జూనియర్ అసిస్టెంట్లు తదితర 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జులై మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యదర్శి షరీఫ్, ఈడే రవి, కె.శేఖర్, శ్రీనివాసరెడ్డి, బుజ్జిబాబు, షేక్ షాహినా జెస్సీ, అరుణ, సౌజన్య, కుమారి తదితరులు పాల్గొన్నారు.