ఇజ్రాయిల్ సైన్యం అంగీకారం
టెల్అవీవ్: గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడిని నిలువరించడంలో తాము విఫలమయ్యామని ఇజ్రాయిల్ సైన్యం అంగీకరించింది. ఇజ్రాయిల్`హమాస్ మధ్య ఘర్షణ ప్రారంభమై ఏడాది దాటిన సందర్భంగా ఆ దేశ ఆర్మీ అధికారి హెర్జి హలెవీ ప్రత్యేక సందేశం విడుదల చేశారు. ‘ఇది సుదీర్ఘ యుద్ధం. ఇది సైనిక సామర్థ్యాలే కాదు… మానసిక శక్తిని… దీర్ఘకాలం పోరాడే సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. ప్రతిరోజు, వారం, నెలా గడిచేకొద్దీ శత్రువుల పరిస్థితి ఘోరంగా తయారవుతోంది. అక్టోబర్ 7కు దాడి జరిగి ఏడాది పూర్తయింది. ఆరోజు ప్రజలను కాపాడాల్సిన బాధ్యతల్లో మేము విఫలమయ్యాం. మన దేశాన్ని నాశనం చేయాలని చూసేవారు ఎప్పటికీ కోలుకోలేరని తెలుసుకోవాలి. దేశానికి ఒక తరం యోధులు, కమాండర్లు యుద్ధంతో చాలా అనుభవాన్ని సంపాదించారు. హమాస్ సైనిక విభాగాన్ని పూర్తిగా ఓడిరచాం. కానీ, ఉగ్రవాద సామర్థ్యాలతో పోరాటం కొనసాగుతుంది. హెజ్బుల్లా సీనియర్ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది’ అని హెర్జి హలెవీ తన సందేశంలో పేర్కొన్నారు. ఓవైపు గతేడాది అక్టోబర్ 7న హమాస్ చేతిలో బందీగా మారిన ఇడాన్ స్టీవీ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు సోమవారం ఇజ్రాయిల్ ప్రకటించింది. ప్రస్తుతం అతడి మృతదేహం కూడా హమాస్ వద్దే ఉందని పేర్కొంది. నోవా ఫెస్టివల్లో ఫొటోగ్రఫీ కోసం స్టీవీ అక్కడికి వెళ్లగా… హమాస్ దళాలు దాడి చేయడంతో తన ఇద్దరు మిత్రులతో కారులో తప్పించుకొనే యత్నం చేశాడు. కానీ, వారిని హమాస్ మిలిటెంట్లు అడ్డగించారు. దీంతో మరో మార్గంలో వేగంగా వెళుతున్న వీరి కారు చెట్టును ఢీకొంది. అనంతరం హమాస్ సభ్యులు ఆ వాహనాన్ని చుట్టుముట్టి అతడి మిత్రులను కాల్చి చంపారు. స్టీవీని బంధించారు. ప్రస్తుతం హమాస్ అధీనంలో ఇంకా 97 మంది బందీలు ఉన్నారు.