విశాలాంధ్ర-హైదరాబాద్: మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిపి కోర్టు ఆమెకు గురువారం నోటీసులు జారీ చేయగా… స్థాయి మరిచి తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్… అదే కోర్టులో క్రిమినల్ పరువునష్టం కేసు వేశారు. వివరాల్లోకి వెళితే… సురేఖ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. తమ కుటుంబంపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పరువు నష్టం కేసు వేశారు. పిటిషన్ పై విచారణ అనంతరం న్యాయస్థానం మంత్రికి నోటీసులు జారీ చేసి… విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. ఎనిమిదో తేదీన నాగార్జున, సాక్షిగా ఉన్న సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. 23వ తేదీన సురేఖ తరపున న్యాయవాదులు నోటీసులకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కోర్టు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందితేనే విచారణ చేపడుతుంది. లేదంటే మంత్రి కోర్టుకు వచ్చి తన వాంగ్మూలం ఇవ్వవలసి ఉంటుంది. మూడో సాక్షిగా వెంకటేశ్వర్లు ఉన్నారు. విచారణలో కేవలం సుప్రియ సాక్ష్యం చాలంటూనే కోర్టు పూర్తి స్థాయిలో వాదనలు వినింది.
క్రిమినల్ పరువు నష్టం దావా
మంత్రి పదవిలో ఉంటూ తన స్థాయి మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. ఆధారాలు లేకుండా కేవలం దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తగిన శిక్ష వేయాలని కేటీఆర్ తన న్యాయవాదుల ద్వారా కోర్టులో కేసు వేశారు. ఇప్పటికే పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసులు ఇచ్చారు. వారం రోజులలోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని తన లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. అయితే లీగల్ నోటీస్ గడువు తీరిన నేపథ్యంలో చట్ట ప్రకారం సురేఖపై కేటీఆర్ గురువారం క్రిమినల్ డిఫమేషన్ కేసు నమోదు చేశారు.