. పూర్తయిన దుకాణాల కేటాయింపు
. రెచ్చిపోతున్న లిక్కర్ సిండికేట్లు
. కొనసాగుతున్న బెదిరింపుల పర్వం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో ఈనెల 16 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలులోకి రానుంది. అతి తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మందుబాబులు పడిగాపులు కాస్తున్నారు. ఈనెల 14న జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఎక్కడికక్కడే లాటరీల ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకుగాను 89,882 దరఖాస్తులు పోటెత్తాయి. ఒక్కో దుకాణానికి సగటున 25 మంది దరఖాస్తు చేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,798 కోట్ల ఆదాయం సమకూరింది. లైసెన్స్ ఫీజుల రూపంలోనూ ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించింది. మద్యం టెండర్లలో కూటమి పార్టీల ఆధిపత్యం నడిచిందని, వాళ్ల అనుచరులే సిండికేట్గా మారి అధికంగా మద్యం దుకాణాలను కైవసం చేసుకున్నారన్న విమర్శలున్నాయి. అయితే కొన్ని చోట్ల టీడీపీ, జనసేనకు తోడు వైసీపీ కూడా సిండికేట్లో భాగమైంది. దుకాణాలు ఎవరికొచ్చినా ఆదాయం పంపకాలపై ఒప్పందాలు కుదిరిపోయాయి. ఈ దఫా మద్యం టెండర్లలో మహిళలు, విద్యావంతులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. చాలా చోట్ల లాటరీ ప్రక్రియలో దాదాపు 350 మద్యం షాపులు(10.2శాతం) మహిళలు దక్కించుకున్నారు. అయితే మహిళల పేరుపై దుకాణాలున్నా…తెర వెనుక నడిపించేదెవరో అందరికీ తెలిసిన విషయమే. విశాఖపట్నంలో అత్యధికంగా 20శాతం, అనకాపల్లిలో 18.4శాతం, మన్యంలో 17.3, ఎన్టీఆర్లో 17.7, శ్రీకాకుళంలో 15.2, విజయనగరంలో 15.7, నెల్లూరులో 13.2శాతం షాపులు మహిళలు కైవసం చేసుకున్నారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన లాటరీలో రెండు దుకాణాలు ఇతర రాష్ట్రాలకు వారికి అదృష్టం వచ్చింది. ఒకటో నంబరు దుకాణం…కర్నాటక రాష్ట్రానికి చెందిన మహేశ్కు, రెండో నంబరు దుకాణం ఉత్తరప్రదేశ్కు చెందిన లోకేశ్ చంద్కు కేటాయించారు. అనంతపురం జిల్లాలో ఓ బీజేపీ నేతకు ఏకంగా ఐదు దుకాణాలు వేలంలో దక్కించుకున్నారు. గతంలో మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా దుకాణాల కేటాయింపు చేపట్టినట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడిరచారు. పక్క రాష్ట్రాల బ్రాండ్లను ప్రమోట్ చేసి..రూ.99కే నాణ్యమైన మద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సరఫరా చేసేందుకు నాలుగు జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. తొలుత 2లక్షల కేసులు దుకాణాలకు సరఫరా చేసి, వినియోగదారుల స్పందన ఆధారంగా కేసులు పెంచాలని ప్రతిపాదించారు. త్వరలో ధరల సవరణకు కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త బ్రాండ్లు, ఉన్న బ్రాండ్లపై ధరల సవరణను ఆ కమిటీ నిర్ణయించి. ఆ తర్వాత కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్`ఎక్సైజ్శాఖ ఆదేశాలు జారీజేసిన విషయం విదితమే.నూతన మద్యం విధానం అమలుపై అధికారులతో సీఎం సమీక్షించి దిశానిర్దేశం చేశారు. అన్ని మద్యం దుకాణాల్లోను నాణ్యమైన మద్యాన్ని ప్రభ్వుత్వం సరఫరా చేయనుంది. దుకాణాల్లోకి కొత్తగా ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయి. ఇక ప్రతి మద్యం దుకాణంలోనూ ఆన్లైన్ పేమెంట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం లభించనుంది.
కొనసాగుతున్న లిక్కర్ సిండికేట్ బెదిరింపుల పర్వం
లాటరీలు పూర్తయ్యాక కూడా లిక్కర్ సిండికేట్ నిర్వాహకులు బరితెగిస్తున్నట్లు సమాచారం. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్నవారిని కొందరు ఎమ్మెల్యేలు, వారి అనుచరులు బెదిరింపులకు గురి చేస్తున్నారు. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ ఇప్పటికే కొంతమందిని హెచ్చరించడంతో లాటరీ లో దుకాణాలు దక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో తమవారికి షాపులు రాకపోవడంతో ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగి…హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో ఈ బెదిరింపుల పర్వం ఊపందుకుంది. దీంతో లైసెన్సులు పొంది ఫీజులు చెల్లించిన దరఖాస్తు దారులు కలవరానికి గురవుతున్నారు. జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు సిండికేట్లుగా మారి దుకాణాలను కైవసం చేసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలతో విక్రయించి, ప్రభుత్వం అనుమతిచ్చిన డిస్టిలరీలద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచారన్న విమర్శలున్నాయి. నూతన మద్యం విధానంలో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలోకి ప్రైవేట్ మద్యం దుకాణాలు రానున్నాయి. ఇంతవరకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన 15వేలమంది సేల్స్మేన్లు, సూపర్ వైజర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో వారిని అవుట్ సోర్సింగ్ విధానంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఉన్న పళంగా ఉపాధి కోల్పోవడంతో వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.