నవంబరు 20న మహారాష్ట్రలో ఒకే విడత పోలింగ్
. జార్ఖండ్లో 13, 20 తేదీల్లో రెండు విడతలు
. మిల్కీపూర్ ఉపఎన్నికపై ఈసీ దాటవేత
న్యూదిల్లీ : మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు నవంబరు 20వ తేదీన ఒకే విడతలో, జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడత(నవంబరు 13, నవంబరు 20)ల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ను ప్రకటించారు. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రెండు విడతల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను మొత్తం 9.63 కోట్లమంది ఓటర్లు ఉన్నారని, వారి కోసం 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాజీవ్కుమార్ పేర్కొన్నారు. 20.93 లక్షల మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
జార్ఖండ్ ఎన్నికలు షెడ్యూల్ ఇలా…
జార్ఖండ్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 2.69 కోట్లమంది ఓటర్లు ఉన్నారని వెల్లడిరచారు. వారి కోసం 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 11.84 లక్షల మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు సీఈసీ చెప్పారు.
మొదటి విడత:
. నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 18
. నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 25
. నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 28
. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: అక్టోబర్ 30
. పోలింగ్ తేదీ: నవంబర్ 13
రెండో విడత :
. నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22
. నామినేషన్ల దాఖలుకు తుది గడువు: అక్టోబర్ 29
. నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 30
. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు: నవంబర్ 1
. పోలింగ్ తేదీ: నవంబర్ 20
. ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23
ఉపఎన్నికల వివరాలు
దేశంలోని 47 అసెంబ్లీ స్థానాలకు, కేరళలోని వయనాడ్(రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ) పార్లమెంట్ నియోజకవర్గానికి నవంబర్ 13న పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్లోని ఒక అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు 26తో ముగియనుంది. జార్ఖండ్ శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. జార్ఖండ్లో జేఎంఎం ప్రభుత్వం ఉండగా, ఈ పార్టీ ఇండియా ఐక్యసంఘటనలో భాగస్వామిగా ఉంది.