నీటిపారుదల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కి వినతి పత్రం అందజేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విశాలాంధ్ర- అనంతపురం : తుంగభద్ర హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేసేందుకు; హంద్రీ-నీవా కెనాల్ రెండింతలు చేసి, పూర్తిస్థాయిలో నీరందించేందుకు తగు చర్యలు చేపట్టాలని బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని అమరావతిలో కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ… .తుంగభద్ర డ్యాంలో సమృద్ధిగా నీళ్లున్నాయి. తుంగభద్ర డ్యాం ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు 32 టిఎంసిల నీళ్లు రావాల్సి ఉండగా, 13 టిఎంసిలు మాత్రమే విడుదలయ్యాయి అని పేర్కొన్నారు. తుంగభద్ర బోర్డు అధికారులు మరిన్ని నీళ్లు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, తుంగభద్ర హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోవడంతో నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు ఖాళీగా ఉన్నాయన్నారు. 4 వేల క్యూసెక్కుల నీటిని హెచ్ఎల్సి ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నప్పటికీ, కాలువ లైనింగ్ పూర్తికానందువల్ల 1800 క్యూసెక్కుల మాత్రమే సరఫరా జరిగిందన్నారు.
గత అనేక దశాబ్దాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు దృష్టి సాధించలేదన్నారు. ఈ బడ్జెట్లో పూర్తిస్థాయి నిధులు కేటాయించి కాలువ లైనింగ్ పనులు పూర్తిచేసి, పూర్తిస్థాయిలో నీటి విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా కోరడం జరిగిందన్నారు.శ్రీశైలం డ్యాం నిండుకుండలా ఉందని అయినప్పటికీ కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు హంద్రీ-నీవా కెనాల్ ద్వారా పూర్తిస్థాయిలో నీళ్లు అందించలేక పోతున్నారన్నారు. గతంలో వైసిపి, టిడిపిలు రెండూ హంద్రీ-నీవా కెనాల్ సామర్థ్యాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చి, నెరవేర్చలేదు అని తెలియజేశారు.. ఈ బడ్జెట్లోనైనా తగు నిధులు కేటాయించి, హంద్రీ-నీవా కెనాల్ ను రెండింతలు చేసి పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా కోరడం జరిగిందన్నారు.