. ఉచితంగా 3 గ్యాస్ సిలెండర్ల పథకం అమలు
. ఇసుక, మద్యంలో జోక్యాన్ని సహించం
. వైసీపీ నేతలు చేసిన తప్పులు మీరూ చేయొద్దు
. ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ప్రజలకు ధైర్యంగా చెప్పండి
. కక్ష సాధింపులుండవు… తప్పు చేసిన వారిని వదలం
. సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు శుభవార్త వినిపించారు. నాలుగు నెలలుగా మహిళలు ఎదురుచూస్తున్న ఉచిత వంట గ్యాస్ పథకం ఎట్టకేలకు దీపావళి నుంచి అమలు కాబోతోంది. సూపర్సిక్స్లో కీలకమైన ఈ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇంఛార్జులు, ముఖ్య నేతలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సూపర్సిక్స్లో మరో కీలకమైన హామీ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ ప్రస్తావన ఈ సమావేశంలో తీసుకురాలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై టీడీపీ నేతలు గుండె మీద చేయి వేసుకొని ప్రజలకు ధైర్యంగా చెప్పవచ్చునన్న చంద్రబాబు… వివిధ అంశాలపై అనుసరించాల్సిన విధానాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. 125 రోజుల పాలనలో మనం చేసిన మంచి పనులు సమీక్షించుకుని ముందుకెళ్లాలి. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఎన్డీయే అధికారంలో ఉంది. మూడు పార్టీలను సమన్వయం చేసుకోవడంతో పాటు మద్దతు ఇచ్చిన ప్రజల ఆశలు నెరవేర్చాలి. గత పాలకులు కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారు. ఇప్పుడు నిధులు అడుగుతుంటే గతంలో ఇచ్చిన నిధులకు యూసీలు అడుగుతున్నారని తెలిపారు. మన ప్రభుత్వంలో కక్షసాధింపులు ఉండవని, అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.
హామీలన్నీ వరుసగా అమలు చేస్తున్నాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉద్యోగాలిస్తామని చెప్పాం… ఆ విధానం ప్రారంభమైంది. డిసెంబరు నాటికి పూర్తవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. పింఛన్లు నెలకు రూ.4 వేలు ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ అందిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం చెత్త పన్ను రద్దు చేశాం. మత్య్సకారుల పొట్టగొట్టే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులు కార్పొరేషన్, గౌడలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించాం. అర్చకుల జీతాలు రూ.10 వేలకు పెంపు, నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు వేతనం పెంపు చేశాం. ధూపదీప నైవేద్యాలకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచాం. విజయవాడ వరద సమయంలో రాత్రింబవళ్లు పని చేశాం. మొదటి సారి దేశ చరిత్రలో ఒక్కో ఇంటికి రూ.25 వేలు ఇచ్చాం. వరద సమయంలో నీళ్లు, బిస్కెట్లు, పాలు అందించాం. ఆటోకు రూ.10 వేలు, రూ.3 వేలు బైక్లకు ఇచ్చాం. 4.15 లక్షల మందికి రూ.618 కోట్లు పరిహారం కింద అందించామని సీఎం వివరించారు. పారదర్శక పాలనలో భాగంగా జీవోలు ఆన్లైన్లో పెడుతున్నాం. గత మద్యం విధానంలో జరిగిన దోపిడీపై విచారణ చేస్తూనే నూతన మద్యం పాలసీని తెచ్చాం. నూతన ఇసుక పాలసీ తెచ్చాం. అయితే ఈ రెండిరటి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. గత పాలకులు చేసిన తప్పులు చేయవద్దు. ప్రజలన్నీ గమనిస్తారని, డబ్బులతో ఎన్నికలు జరిగితే 93 శాతం సీట్లు మనకు వచ్చేవి కావని చంద్రబాబు అన్నారు.