ఇసుక రవాణాలో జోరుగా వసూల దందా
విశాలాంధ్ర- చిలమత్తూర్ రూరల్ :మండల పరిధిలోని కుశావతి చిత్రావతి నదులలో ఇష్టారాజ్యముగా ఇసుకను త్రవ్వేస్తుండడంతో ఆ నదుల స్వరూపాలే కోల్పోతున్నాయి, ఇదే అదునుగా పలువురు ఇసుక రవాణాలో జోరుగా వసూల దందా కొనసాగిస్తున్నారు, స్థానికంగా ఉన్న కొంతమంది నదుల తీరప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ నుంచి ఇసుకను తరలిస్తే తమకు కుప్పం రూపంలో ఎద్దుల బండికి రూ200, అదే ట్రాక్టర్ లోడ్ కైతే రూ500 చెల్లించాల్సిందేనని తిష్ట వేసి కూర్చొని వసూలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నదులు గ్రామాలకు సమీపంలో ఉండడంతో కొందరు అవకాశవాదులు ఇదే అదునుగా పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని వినికిడి. ఇకపోతే పలువురు పెద్ద ఎత్తున ఇసుకను డంపు చేసి అధికార పార్టీ అండదండలతో కర్ణాటక రాష్ట్రానికి ఇసుకను తరలించి రూ లక్షల్లో గడుస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న సత్వర చర్యలు అధికారులు తీసుకోకపోతే నది స్వరూపాలు కనుమరుగైపోయే అవకాశం పొంచి ఉన్నాయి. మీటర్ల లో ఉన్న నదీ స్వరూపాలు ఇసుక తరలించడంతో అడుగులలో లెక్కించాల్సి వస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇది ఇలాగే కొనసాగితే రాను రాను ఆ నదుల స్వరూపాలు కనబడకుండా పోయి ఎక్కడ నదులు అంటూ దీపం పెట్టి వెతకాల్సి వస్తుందని మేధావులు చర్చించుకుంటున్నారు.