దసరా మర్నాడు ఉత్తరప్రదేశ్లోని బహ్రేయిచ్ ప్రాంతంలో రెండు మతాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 22 ఏళ్ల రాం గోపాల్ మిశ్రా మరణించాడు. ఆయన ఏ మతానికి చెందినవాడు అన్నది అంత ప్రధానమైన అంశం కాదు. ఆయన మరణానికి ఏ మతం వారు కారకులు అన్నది కూడా ముఖ్యం కాదు. అసలు సరదాగా, హుషారుగా, ఆనందంగా పండగలు చేసుకునే సందర్భాలలో మత కలహాలు ఎందుకు చెలరేగుతున్నాయి, వీటి వెనకాల ఉన్నవారు ఎవరు, వారు ఎంతటి విద్వేషాన్ని రెచ్చగొట్టినందువల్ల కలహాలు జరుగుతున్నాయన్నదే కీలకాంశం. ఈ దుర్ఘటన జరిగిన తరవాత అక్కడ నాలుగు రోజుల నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు. కలహాలు మరింత విస్తరించకుండా నిరోధించడం ప్రభుత్వ ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ దీనివల్ల మనుషుల మధ్య సంభాషణలకూ అవాంతరం కలుగుతోంది. ఆర్థికనష్టం అపారంగా ఉంటోంది. యోగీ సర్కారు ఈ దుర్ఘటన తరవాత అనేకమందిని అరెస్టు చేయడంలో నిమగ్నమైపోయింది. ఈ కలహాలకు కొన్నేళ్లుగా తాము పెంచి పోషిస్తున్న విద్వేషమే ప్రధాన హేతువు అన్న వాస్తవాన్ని వాటంగా విస్మరిస్తోంది. మిశ్రా మరణం ఎలా జరిగింది, ఆయనను ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారో ప్రభుత్వం ఒడిలో ఆశీనమైన మీడియా కట్టుకథలల్లి ప్రచారంలోపెడ్తూ ఈ ఘర్షణలకు మరింత ఆజ్యం పోస్తోంది. అది మరింత ప్రమాదకరం. రాం గోపాల్ మిశ్రాను అనేక చిత్రహింసలు పెట్టారని, అతడి కాలి గోళ్లు పెరికేశారని గోదీ మీడియా కథలల్లి ప్రచారంలో పెడ్తోంది. కానీ శవ పరీక్ష ఈ దుష్ప్రచారాన్ని తుత్తినియలు చేసింది. మిశ్రా కాలి గోళ్లు పెరికేసిన జాడలేవీ లేవు కాని ఆయన బొటన వేలు మధ్యభాగానికి గాయం అయిందని శవపరీక్ష నివేదిక చెప్తోంది. అతని కంటి దగ్గర గాయాలున్నట్టు కూడా తెలియజేసింది. దాదాపు మూడు రోజులుగా గోదీ మీడియా కొనసాగిస్తున్న దుష్ప్రచారం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి తప్ప ఎందుకూ ఉపకరించదు. మిశ్రాకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారని కూడా ప్రచారంలో పెడ్తున్నారు. కానీ యోగీ సర్కారు అధీనంలో పనిచేసే పోలీసులే ఖండిస్తున్నారు. ఈ మరణానికి కారకులైన వారిని నిర్బంధించి చట్ట ప్రకారం శిక్ష పడేట్టు చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. అయితే యోగీ ఆధిపత్యంలో ఇవన్నీ సక్రమంగా జరుగుతాయని నమ్మడం కష్టమే. ఈ సంఘటనలో మరే వ్యక్తికి చిన్న గాయమైనా కలగలేదు. మిశ్రా శరీరంలో అనేక చిన్నచిన్న తుపాకీ గుళ్ల జాడలు మాత్రం కనిపించాయి. దుర్గా విసర్జన ఊరేగింపు మార్గ మధ్యమంలో ముస్లింలు అధికంగా నివసించే ఒక ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఊరేగింపులో పాల్గొంటున్న వారు ముస్లింలను, వారి అమ్మలక్కలను దూషించిన పాటలు వినిపించడం మొదలు పెట్టారు. ఇది ఏదో విధంగా మతకలహాలు, ముఖ్యంగా ముస్లింలను రెచ్చగొట్టడానికి చేసిన పనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఊరేగింపులో పాల్గొన్న రాం గోపాల్ మిశ్రా ఒక ముస్లింల ఇంట్లోకి దూసుకెళ్లి మేడ మీదకు వెళ్లి అక్కడున్న ముస్లింల చిహ్నంగా భావించే ఆకుపచ్చ జెండాను పెకలించివేసే క్రమంలో ఆ భవనం రైలింగును పడదోశాడు. అక్కడ కాషాయ జెండా ఎగురవేశాడు. దీని గురించి మాత్రం ఊరేగింపులో పాల్గొన్న మూకలు ప్రస్తావించవు. రాం గోపాల్ మిశ్రా మృతి తప్పని సరిగా ఖండిరచాల్సిందే. ఆయన మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాల్సిందే. ఇందులో మరో మాటకు తావు లేదు.
ఇలాంటి సంఘటనే ఏ బెంగాల్లోనో, కేరళలోనో జరిగితే ఇప్పటికే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్న నినాదాలు మిన్నంటేవి. ఇప్పుడు ఎవరూ యోగీ ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని అడగరెందుకో! గోదీ మీడియా కూడా యోగి రాజీనామా చేయాలని రగడ చేయదు. పండగలు, పబ్బాల సమయంలో మతపరమైన ఊరేగింపులు ఇప్పుడే జరగడంలేదు. అయితే విద్వేషం రెచ్చగొట్టేవారు కొత్త కొత్త శోభా యాత్రలు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భాలలో కావాలని ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి యాత్రలు నిర్వహిస్తున్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ అత్యధిక సంఖ్యాకులైన వారికి మైనారిటీల నుంచి రక్షణ లేదు అన్న ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. గత పదేళ్ల పైనుంచి ఈ దుర్భర వాతావరణమే కొనసాగుతోంది. ఇలాంటి ఊరేగింపులకు అనుమతి మంజూరు చేసేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టంచేసే బాధ్యతను యోగీ ప్రభుత్వం నిర్వహించేదని కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. అనుమతిఇచ్చే ముందు రెండు పక్షాలను సంప్రదించి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడబోమని హామీ తీసుకున్న ఉదంతాలూ కనిపించడం లేదు. అంటే ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు ఉందనుకోవలసి వస్తోంది. తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచి సంఘ వ్యతిరేక శక్తులను ఏరిపారేశామని, ఇప్పుడు తమ రాష్ట్రం శాంతిభద్రతలకు ప్రతీకంగా మారిందని యోగీ పదే పదే బాకా ఊదుతుంటారు. కాని ఇలాంటి సంఘటనలు యు.పి.లో జరిగినన్ని మరే రాష్ట్రంలోనూ జరగడం లేదు. రెండు పక్షాలను పిలిపించిన దాఖలాలే లేవు. ఒక వ్యక్తి మరణానికి దారితీసిన సంఘటనకు తావే ఉండకూడదు. కానీ ప్రయత్నపూర్వకంగా విద్వేషం ప్రచారం చేస్తున్నారు. వీటిని బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా కనిపించవు. ఇలాంటి పనులు అంతిమంగా హిందూ మతానికే అపకారం చేస్తాయి. హిందువులలో లేనిపోని భయాందోళనలు సృష్టిస్తాయి. అనేక మంది బీజేపీ నాయకుల పిల్లలు విదేశాల్లో చదువుతూ ఉంటారు. వారి పిల్లలు మతకలహాలకు దారితీసే ఊరేగింపుల్లో ఎప్పుడూ పాల్గొనరు. ఇక్కడ మతోద్రేకాలకు బలయ్యేది మాత్రం సామాన్య జనం, యువతరం. వారి మనసుల నిండా విద్వేషం నింపడంలో మతతత్వ బీజేపీ నిరంతరం కృషి చేస్తూనే ఉంది. బహ్రేయిచ్ సంఘటనలో మరణించింది ఏ మతం వాడు అన్న చర్చలు కేవలం కలహాలు మరింత పెరగడానికే ఉపకరిస్తాయి. మత విద్వేషాలు రగుల్కుంటూనే ఉన్నాయి. ఈ దుష్ప్రచారానికి లొంగి పోకుండా మనల్ని కాపాడుకోవడం మన బాధ్యతే. ఈ సందర్భంలో హిందూ మూకలకు ముస్లింల ఇళ్లల్లో దూరే అవకాశం ఎవరిస్తున్నారు. ఈ అక్రమ ప్రవేశాలను నిరోధించే బాధ్యత ప్రభుత్వాలదే కదా? యోగీ ఈ విషయంలో సంపూర్ణంగా విఫలమయ్యారు. హిందూ మతోన్మాదానికి ఆజ్యం పోయడంలో యోగీ ఆదిత్యనాథ్ మోదీ, అమిత్ షాను ఎప్పుడో మించిపోయారు. ఉత్తరప్రదేశ్లో తొమ్మిది శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సరిగ్గా ఎన్నికలు జరగడానికి కొద్దిగా ముందు మత కలహాలు రెచ్చగొట్టేపని ఓ పథకం ప్రకారం జరుగుతోంది. తాము అధికారంలో లేని చోట్ల అధికారం సంపాదించడానికి బీజేపీ అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. కానీ మతకలహాలు రెచ్చగొట్టే కుతంత్రం అత్యంత ప్రమాదకరం. బహ్రేయిచ్ సంఘటన కచ్చితంగా విద్వేష ప్రచార పర్యవసానమే.