మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభల ఎన్నికల కార్యక్రమం ప్రకటించడం పూర్తి అయింది. దీని ప్రకారం మహారాష్ట్ర అంతటా ఒకే దశలో నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. జార్ఖండ్ లో మాత్రం నవంబర్ 13న మొదటి దశ, నవంబర్ 20న రెండోదశ పోలింగ్ పూర్తి అవుతుంది. ఓట్ల లెక్కింపు రెండు రాష్ట్రాలలో నవంబర్ 23న జరుగుతుంది. పోలింగ్ దశల గురించి మీడియా ప్రశ్నలు అడుగడం సహజం. ఈ ప్రశ్నలకు రాజీవ్ కుమార్ సమాధానాలూ ఇచ్చారు. కానీ ప్రామాణికమైన జవాబేదీ రాలేదు. ఇ.వి.ఎం.ల గురించి మళ్లీ ప్రశ్నలు తలెత్తితే రాజీవ్ కుమార్ బడిపిల్లలకు చెప్పే రీతిలో ఇ.వి.ఎం.ల పనితీరు వివరించారు. అసలు ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. కిందటిసారి కూడా మహారాష్ట్రలో ఒకే విడత పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి గుర్తు చేశారు. జార్ఖండ్ లో రెండు విడతలు ఎందుకో మాత్రం చెప్పలేదు. బహుశ: ‘‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’’ అన్న మోదీ మంత్ర జపాన్ని ఆచరణలో పెట్టాలన్న స్వామిభక్తిని నిరూపించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారేమో తెలియదు. 2021లో బెంగాల్ శాసనసభ ఎన్నికలు ఎనిమిది విడతల్లో జరిగాయి. కిందటిసారి జార్ఖండ్ పోలింగ్ కూడా అయిదు విడతల్లో పూర్తి అయింది. ఈ రెండు శాసనసభల ఎన్నికలతో పాటు ఉత్తరప్రదేశ్లో పది శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎన్నికల కార్యక్రమం మాత్రం తొమ్మిది నియోజక వర్గాలకే పరిమితం చేశారు. మిల్కీపూర్ నియోజక వర్గానికి ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు అంటే ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా అయితే లేదు. మిల్కీపూర్ ఫైజాబాద్ నియోజక వర్గంలో భాగమైన శాసనసభ నియోజకవర్గం. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఫైజాబాద్ నుంచి సమాజ్వాదీ పార్టీ నాయకుడు అవధీశ్ ప్రసాద్ గెలిచారు. ఫైజాబాద్ నియోజకవర్గంలోనే గత జనవరిలో మోదీ సంప్రోక్షణచేసి ప్రారంభించిన అయోధ్య రామ మందిరమూ ఉంది. అలాంటి చోట సమాజ్ వాదీ విజయం సాధించడం విశేషమే. ఆ కారణంగానే మిల్కీపూర్ ఉప ఎన్నికను వాయిదా వేశారని అనుకోవలసి ఉంటుంది. పనిలో పనిగా రాజీవ్కుమార్ ఎగ్జిట్ పోల్స్ నిరర్ధకత గురించీ జ్ఞానబోధ చేశారు. ఎగ్జిట్ పోల్స్లో శాస్త్రీయ విధానం ఏమీ ఉండదని తేల్చేశారు. ఎగ్జిట్ పోల్స్ వినాశకరమైనవి అని కూడా ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం అమలులో అన్ని దేశాలలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తూనే ఉన్నారు. మరి రాజీవ్ కుమార్ వీటిని ఎందుకు అభ్యంతరపెడ్తున్నారో తెలియదు. ఆ వివాదాన్ని అలా ఉంచినా మహారాష్ట్రలో 26వ తేదీన కొత్త శాసనసభ ఏర్పాటు కావాల్సి ఉంది. ఫలితాలు 23న వెలువడతాయి. అందులో ఏ పక్షానికీ మెజారిటీ రాకపోతే ఫలితాలు వచ్చిన మూడోరోజు ప్రభుత్వం ఎవరు ఎలా ఏర్పాటు చేస్తారో! ఒకవేళ ఏ పక్షానికీ మెజారిటీ రాకపోతే కొత్తగా ఎన్నికైన వారిని గోవాకో, గౌహాతికో తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారు ఎవరు అన్న ప్రశ్నలు ఉండనే ఉంటాయి. మహారాష్ట్రలో పోలింగ్ జరిగే రోజు బుధవారం అని రాజీవ్ కుమార్ నొక్కి చెప్పారు. మహారాష్ట్రలో ఎన్.సి.పి.లోని రెండు వర్గాల మధ్య ఎన్నికల చిహ్నం వివాదం సుప్రీంకోర్టులో ఇంకా తేలనే లేదు. కానీ రాజీవ్ కుమార్ దగ్గర దీనికి సమాధానం లేదు. రెండు పార్టీలకు కేటాయించిన ఎన్నికల చిహ్నాల్లో సామ్యం ఎక్కువ అన్న ఆరోపణా ఉంది. పాత ఎన్నికల చిహ్నం ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని ఎన్.సి.పి. వర్గానికి కేటాయించారు. దీనివల్ల ఆ పక్షానికి ఎక్కువ ప్రయోజనం కలగొచ్చు. అందుకే శాసనసభ ఎన్నికలకు ముందే రెండు ఎన్.సి.పి. వర్గాలకు కొత్త చిహ్నాలు కేటాయించాలని ఎన్.సి.పి. అధినేత శరద్ పవార్ అభ్యర్థించారు. కానీ దీన్ని అంగీకరించలేదు.
హర్యానా, జమ్మూ-కశ్మీర్ ఎన్నికలతో పాటే మహారాష్ట్ర, జార్ఖండ్ లో కూడా ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదన్న ప్రశ్న తలెత్తింది. దీనికి కారణం ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి వివరించలేదు. ఎందుకో ఆచరణలో మాత్రం తెలిసిపోతూనే ఉంది. మహారాష్ట్రలో బీజేపీతో కూడిన మహాయుతి ప్రభుత్వం మళ్లీ అధికారం రావడానికి అక్కడి ప్రజలకు తాయిలాలు పంచాలన్న బీజేపీ ఆలోచనను ఎన్నికల సంఘం ఆమోదించిందనుకోవాలి. సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 30, అక్టోబర్ 4, అక్టోబర్ 10, అక్టోబర్ 14న ఆరుసార్లు మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. వీటిలో 165 నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 23న జరిగిన సమావేశంలో 23 నిర్ణయాలు, సెప్టెంబర్ 30న 30 నిర్ణయాలు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకోగలిగింది. అక్టోబర్ 10న జరిగిన మంత్రివర్గ సమావేశంలో బ్రాహ్మణ, విశ్వకర్మ, రాజ్పుత్ లాంటి సామాజిక వర్గాలకు విడివిడిగా కార్పొరేషన్ల లాంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మంత్రివర్గ సమావేశంలో ఏకంగా 38 నిర్ణయాలు తీసుకున్నారు. పూనే రింగ్రోడ్ పెట్టుబడిని విపరీతంగా పెంచేశారు. ఇది మోదీకి ఆప్తులైన వారికి ప్రయోజనం కలిగించాలన్న ఉద్దేశం ఉండి ఉండొచ్చు. అక్టోబర్ 14న అంటే ఎన్నికల కార్యక్రమం ప్రకటించడానికి ఒక్క రోజు ముందు అయిదు టోల్ గేట్లను ఎత్తేయాలని నిర్ణయించారు. ఈ టోల్ గేట్ల గడువును సెప్టెంబర్లోనే 2026 దాకా పొడిగించిన షిండే ప్రభుత్వం హఠాత్తుగా ఎందుకు తొలగించాలనుకుంటుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. లోకసభ ఎన్నికలకు ముందు కూడా మధ్యప్రదేశ్ లో అమలవుతున్న లాడ్లీ బెహనా పథకాన్ని అమలు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద రెండు లక్షలమంది మహిళల ఖాతాల్లో నెలకు 1500 జమ చేస్తున్నారు. మరోవేపు అప్పుల్లో మునిగిపోయామని ఆ ప్రభుత్వమే యాగీ చేస్తుంటుంది. ఎన్నికల్లో గెలవడానికి బీజేపీని మించిన ఎత్తులు ఎవరెత్తగలరు? వీటిని రేవడీలని, వాటికి దూరంగా ఉండాలని హితబోధ చేసేదీ మళ్లీ ప్రధానమంత్రి మోదీనే. ఆయన మాటకు, చేతకు ఎన్నడూ పొంతన ఉండదు కనక అలవాటు పడడమే శరణ్యం. మహారాష్ట్రలో వ్యాపారం ఎక్కువగా సాగుతుంది. ఆందులో గుజరాతీల పాత్రా ఎక్కువే. గుజరాతీలు తమ సొమ్ము దోచుకు తింటున్నారన్న ఆరోపణలూ తక్కువేం లేవు. ఏ రాష్ట్త్రమైనా గుజరాత్ తరవాతేనన్న తత్వం ప్రజలు బుర్రకు ఎక్కించుకోవాలి. సర్పంచుల వేతనాలూ గణనీయంగా పెంచేశారు. ఈ వేతనాలు మూడు వేల నుంచి పదివేల దాకా ఉంటాయి. మదర్సాల్లో పాఠాలుచెప్పే ఉపాధ్యాయుల జీతాలే ఏకంగా ఆరువేల నుంచి 16 వేలదాకా పెంచేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు మదర్సా ఉపాధ్యాయుల వేతనాన్ని ఆరువేల నుంచి రెట్టింపు చేశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నియోజకవర్గమైన థాణే నియోజకవర్గం మీద కనకవర్షమే కురిపించారు. అక్కడ ఏకంగా 30 వేల కోట్ల పథకాలు ప్రకటించారు. ఇక హర్యానా, జమ్మూ-కశ్మీర్ ఎన్నికలతోపాటు మహారాష్ట్రలో ఎన్నికలు ఎందుకు జరిపించలేదో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.