50 సం నిండిన చేతివృత్తిదారులకు, పేదలకు పెన్షన్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి… చేతివృత్తిదారుల సమస్య పరిష్కరించేంతవరకు పోరాడుతాం… సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్
విశాలాంధ్ర- అనంతపురం : బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా చేతివృత్తిదారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని, 50 సంవత్సరాల నిండిన చేతి వృత్తిదారులకు , పెద్దలకు పెన్షన్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, చేతివృత్తిదారుల సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాడుతాం సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు. మంగళవారం చేతివృత్తిదారులను ఆదుకునేందుకు చేతి వృత్తిదారుల సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల బిసి సంక్షేమ కార్యాలయం ముందు ఏపీ చేతివృత్తి దారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు సి.లింగమయ్య, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పోతులయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సివి రామకృష్ణ, జిల్లా రజక వృత్తిదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు సి నాగప్ప ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ మాట్లాడుతూ….
రాష్ట్ర జనాభాలో దాదాపు 30 శాతం ఉన్న 28 రకాలపైగా ఉన్న చేతి వృత్తిదారులు ప్రధానంగా బిసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వార్గలకు చెందినవారే. తరతరాలుగా ఎంతో వృత్తి నైపుణ్యంతో సమాజానికి తమ వృత్తుల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ చిన్న చూపు చూస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. నాయి బ్రాహ్మణులు,రజకులు చేస్తున్నటువంటి వృత్తిని ఇతర కులస్తులు సెలూన్ షాపులు, డ్రై క్లీనింగ్ నిర్వహిస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. చేతివృత్తిదారుల సమస్యలపై చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఐ జిల్లా సమితి మద్దతు ఉంటుందని తెలియజేశారు. చేతివృత్తిదారుల సమాఖ్య , మేకల పెంపకం దారులు, రజక వృత్తిదారుల సమాఖ్య , నాయి బ్రాహ్మణుల సంఘం నాయకులు మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి పేర్కొన్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం చేతి వృత్తులను, కుల వృత్తులను ఉద్ధరిస్తానని 56 చేతి వృత్తుల, కుల వృత్తుల కార్పొరేషన్లకు ఛైర్మన్లను పాలకవర్గాలను ఏర్పాటు చేసి ఒక్క నయా పైసా నిధులు కేటాయించకుండానే చేతి వృత్తి దారులను దారుణంగా మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు “సూపర్ సిక్స్” వాగ్దానాలతో పేదలను, చేతి వృత్తి దారులను ఆదుకునేందుకు ఏమాత్రం కార్యాచరణ అమలుచేయడం లేదన్నారు. 50 సంవత్సరాలు నిండిన పేదలకు, చేతి వృత్తి దారులకు పెన్షన్ అందిస్తామని | ప్రకటించినప్పటికీ నేటికి కూడా పెన్షన్లను ఇచ్చేందుకు సిద్ధం కావడం లేదన్నారు. బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రూపాయలకు తగ్గకుండా 50% సబ్సిడీతో సొంతపూచీకత్తుతో రుణాలు ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలో దాదాపు 30 శాతం జనాభా ఉన్న చేతివృత్తి దారులకు రాష్ట్ర బడ్జెట్లో 25% నిధులు కేటాయించి ఉప ప్రణాళిక ద్వారా నిధులు ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అనంతరం బీసీ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ గోవిందరాజులు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వీరి సమస్యలను తీసుకువెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వృత్తిదారుల సమాఖ్య గౌరవాధ్యక్షులు కె రామాంజనేయులు నగర అధ్యక్షులు గోవిందరాజులు శాలివాహన సంఘం నాయకుడు ఆనంద్ మత్స్యకారుల సంఘం నాయకుడు రామాంజనేయులు రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా నాయకులు నార్పల నారాయణప్ప, వడ్డెర్ల సంఘం జిల్లా నాయకులు శ్రీనివాసులు, సింగనమల రంగయ్య సంజీవులు చిన్న నారాయణస్వామి లక్ష్మీనారాయణ సి నాగరాజు పెద్దన్న ఆదినారాయణ ఈశ్వరయ్య, లక్ష్మీదేవి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.