కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి
విశాలాంధ్ర`హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి చేసుకున్నా అట్టడుగు వర్గాలయిన దళితుల అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నేటికీ దళితుల దరిచేరడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అఖిల భారత దళిత హక్కుల పోరాట సమితి (ఏఐడీఆర్ఎం) 2వ జాతీయ మహాసభల సన్నాక సమావేశం హిమాయత్ నగర్లోని రాజ్ బహదూర్ గౌర్ హాలులో కె.యేసు రత్నం అధ్యక్షతన మంగళవారం జరిగింది. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మేడ్చల్ జిల్లా కార్యదర్శి డీజే సాయిల్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించడం మహత్తరమైనదన్నారు. అయితే సమ న్యాయకల్పనలో ప్రభుత్వాల కృషిలో లోపం కనిపిస్తోందని తెలిపారు. తరతరాలుగా అణచివేత, అంటరానితనం, వివక్ష, దోపిడీ పీడనల నలిగిపోతున్న అట్టడుగు వర్గాలయిన అశేష శ్రామిక దళితుల అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా దళిత సామాజిక న్యాయం కోసం, విద్య, వైద్యం వ్యాపారాన్ని రద్దు చేయాలని, అవినీతికి వ్యతిరేకంగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని ఏఐడీఆర్ఎం పోరాడుతుందని తెలిపారు. ఏఐడీఆర్ఎం జాతీయ మహాసభలు జనవరి 5,6,7 హైదరాబాదులో జరగనున్నాయని, ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దళితులకు కనీస రక్షణ కరువవుతున్నదన్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత సుమారు రెండు లక్షల దాడులు జరిగినట్టు కేంద్ర సామాజిక న్యాయ శాఖే ప్రకటించిందని తెలిపారు. ప్రతి చిన్న విషయంలోనూ దళితులనే లక్ష్యం చేయడం బీజేపీ పాలనలో పరిపాటిగా మారిందని విమర్శించారు. దేశాన్ని విస్మయానికి గురిచేసిన గిరిజనుడిపై మూత్ర విసర్జన, మణిపూర్లో ఇద్దరు గిరిజన యువతులను వివస్త్రలుగా చేసి ఊరేగించిన ఘటన వంటివన్నీ ఇందులో భాగమేనని అన్నారు. అయినా సరే వీటిపై ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని అన్నారు. అదే సనాతన ధర్మం అంశంలో మాత్రం దాడులు తిప్పి కొట్టాలంటూ దేశ ప్రజలను రెచ్చగొట్టడంలో భాగంగానే ఉంటుందని ఆయన మండిపడ్డారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారూపాక అనిల్ కుమార్, తాళ్లపల్లి లక్ష్మణ్, సలిగంటి శ్రీనివాస్, కె.రత్నకుమారి, కె.సహదేవ్, ఎ.రాజ్ కుమార్, జె.కుమార్, కె.రాజరత్నం, టి.రామకృష్ణ, బి.లక్ష్మీపతి, ఉషశ్రీ, దేవి, పోచన్న తదితరులు పాల్గొన్నారు.