Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

నేటి రాత్రి తీరం దాటనున్న దానా.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్నదానా తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ, రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దాదాపు 36 గంటలు తీవ్ర తుపానుగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, మిగిలిన ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఏపీలో మూడు రోజులు వానలు
తుపాను ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పోర్టులకు రెండో నంబర్ హెచ్చరిక
భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్టణం పోర్టుకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సముద్రం అలజడిగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. దానా తుపాను నేపథ్యంలో గత రాత్రి 8 గంటల నుంచి నేటి ఉదయం 10 గంటల మధ్య ఈస్ట్రన్ సీల్దా డివిజన్‌లో 190 రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోనూ 14 రైళ్లు రద్దయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img