పాడేరులో వైకాపా హ్యాట్రిక్ సాధిస్తుంది
2024 లో ఎమ్మెల్యేగా భాగ్యలక్ష్మి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిలు విజయం సాధించడం ఖాయం.
ఎంపీపీ అనూష దేవి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు పుష్పలత.
విశాలాంధ్ర -చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- పార్టీ టికెట్ల కోసం పైరవీలు జరుగుతున్న సందర్భంలో అపోహలు నమ్మొద్దని, ఆందోళన చెందవద్దని పాడేరులో వైకాపా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఎంపీపీ కోరాబు అనుష దేవి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత అన్నారు. ఎంపీటీసీ సభ్యులు దాసరి దార లక్ష్మి, లువ్వాబు మీనా కుమారి లతో కలిసి శనివారం ఆమె మాట్లాడుతూ 2024 లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల టిక్కెట్ల కోసం ఆశావహులు పైరవీలు చేయడం సహజమని, అంత మాత్రం చేత పార్టీ కోసం పని చేయని వారికి టిక్కెట్లు కేటాయించే సంస్కృతి వైకాపాలో లేదన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి శ్రమించిన, రాజకీయం అంటే తెలియని ఎంతోమందికి నేడు వైకాపాలో సముచిత స్థానం కల్పించి అనేక పదవులు అప్పగించడం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో గడచిన నాలుగున్నర ఏళ్లకు పైగా శాసన సభ్యురాలిగా, అల్లూరి జిల్లా అధ్యక్షురాలిగా వైకాపా బలోపేతానికి అహర్నిశలు శ్రమించిన కొట్ట గుళ్లి భాగ్యలక్ష్మిని కాదని మరొకరికి ఈ సీటు కేటాయించే ప్రసక్తి లేదన్నారు. పాడేరు ఎమ్మెల్యే సీటు తమకే కేటాయిస్తారని కొంతమంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అటువంటి దుష్ప్రచారాలను నమ్మొద్దని, రాబోయే ఎన్నికలలో పాడేరు నియోజకవర్గంలో వైకాపా హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంటుందని, పాడేరులో భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతోపాటు, మరో మారు రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కొలువు తీరడం ఖాయమని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారాన్ని చేపడతారన్నారు.