తహశీల్దార్ రామకృష్ణ
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఆంధ్రా కశ్మీర్ గా పేరొంది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడంతో పాటు శీతల ప్రాంతంగా విరాజిల్లుతూ వేలాది మంది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఎత్తైన ఉమ్మడి ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి పెద్ద రోప్ వే నిర్మించ గలిగితే మన్య ప్రాంతం రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని తహసీల్దార్ టీ రామకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రకృతి సహజసిద్ధ వనరులకు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న సహజ సిద్ధమైన అందాలకు ఆలవాల మైన మన్య ప్రాంతం ఉపాధి అవకాశాలకు, ఆర్దికంగా స్తిరపడేందుకు అనేక అవకాశాలున్న ప్రాంతం అన్నారు. ఇటువంటి సహజ సంపద కలిగిన ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృధ్ధి పరచుకోగలిగితే ఈ ప్రాంత ప్రజానీకానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. నిత్యం శీతల వాతావరణానికి పేరెన్నిక గన్న మన్య ప్రాంతంలో విదేశీ పంటలైన అవకాడో, లిచీ, స్ట్రాబెర్రీ, డ్రాగన్ ఫ్రూట్ తదితర ఎన్నో ఔషధ గుణాలున్న ఫలాలు ఈ ప్రాంతంలో పందుతున్నాయన్నారు. తరతరాలుగా రసాయనాలు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం ద్వారా నాణ్యమైన చిరు ధాన్యాల సాగును ఈ ప్రాంత ప్రజలు చేపడుతున్నారన్నారు. రహదారుల అభివృద్ది లో భాగంగా 516 జాతీయ రహదారి విస్తరణ పనులు చింతపల్లి, లంబసింగి మీదుగానే శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతం కావడం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించి రోప్ వే వంటి అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి పరచి నట్లయితే ఆంధ్రా కశ్మీర్ ప్రాంతమైన లంబసింగి ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ లోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.