అనకాపల్లి: ఆర్థిక ఇబ్బందుల తో జిల్లా కేంద్రంలో స్వర్ణకారుని కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిగ్భ్రతి కలిగించింది.ముగ్గురు పిల్లలతో సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోగ, 9 ఏళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. స్థానిక పోలీసుల సమాచారం మేరకు, తెనాలి ప్రాంతానికి చెందిన కొడగలి శివరామకృష్ణ(40) భార్య, ముగ్గురు కుమార్తెలతో అనకాపల్లి పట్టణంలోని ఓ రెసిడెన్షియల్ ప్లాట్ లో కొంతకాలంగా నివాసముంటున్నారు. స్థానికంగా స్వర్ణకార వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్న శివరామకృష్ణ కు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో ఫైనాన్సర్లు తీసుకున్న అప్పు చెల్లించమని వేధింపులకు గురి చేయడంతో ఆ బాధ తట్టుకోలేక భార్య మాధవి (38), పిల్లలు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా గురువారం రాత్రి సైనేడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అప్పటికే భార్య, భర్తతో పాటు కుమార్తెలు వేద వైష్ణవి (15), జాహ్నవి లక్ష్మి(13) మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. చిన్న కుమార్తె కుసుమ ప్రియ(9) కొన ఊపిరితో ఉండడంతో వెంటనే బాలికను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. భార్య భర్త ఇద్దరు పిల్లల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అనకాపల్లి టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.