విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.15.10.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం లో సద్భావ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా స్థానిక స్వయం భూ వినాయకుడు దేవస్థానం ఆవరణలో ” కమ్యూనిటీ ఫ్రిడ్జ్” ఏర్పాటు చేసినట్లు సేవా గ్రూప్, సి.డి.వి.ఎం. కమ్యూనిటీ ఫౌండేషన్ అడ్మిన్ కొప్పాక రాజేష్, వినాయకుని గుడి ప్రధాన అర్చకులు కొడమంచలి చలపతిరావు లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీని ఉద్దేశ్యం మనలో మనం, మనకు మనం గా సేవ చేయాలి అనే సంకల్పంతో మీ పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి ఏ కార్యక్రమం అయినా మన చుట్టూ వుండే మరో పది మందికి ఆహారాన్ని ఉచితంగా అందించాలనే ఆశయానికి ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఉపయోగపడుతుంది అన్నారు. అలాగే వివిధ మన ఇళ్లల్లో జరిగే పలు శుభ కార్యాల్లోనూ, పలు రెస్టారెంట్ లోనూ తినే ఆహారం మిగిలిపోయి, దానిని ఏమి చేయాలో తెలియక వృధాగా పెంట మీద పారేస్తాం,…. అలా వృధా కాకుండా మిగిలిన ఆహార పదార్థాలు ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి, ఆకలి గొన్న వారికి అందిస్తామన్నారు. ఈ ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి, లేదా ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థాలు ఉచితంగా తీసుకోవడానికి అందరికీ అందుబాటులో బి.ఎన్. రోడ్డు లో గల వినాయకుని ఆలయం వద్ద వుంటుందని తెలియజేసారు. మిగిలిన వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ లు.: 9247799213, 9985045010, 7842799881.