విశాలాంధ్ర -అనకాపల్లి: పట్టణ సమీపంలో శారద నగర్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును జనసైనికులు, మహిళలు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఈమధ్య నిర్వహించిన లాటరీలో శారద నగర్ షాపును దక్కించుకున్న యాజమాన్యం గురువారం మద్యం షాపును ప్రారంభిస్తుండగా మహిళలు, జన సైనికులు భారీగా అక్కడ చేరుకుని షాపును తెరవనీయకుండా ఆందోళన చేశారు. బడి, గుడి సమీపంలో నివాస గృహాల దగ్గర మద్యం షాపులు ఏర్పాటు చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని షాపును తెరిపించే ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు సద్ది చెప్పే ప్రయత్నం చేశారు. నిబంధనలను అనుసరించే షాపు ఉండాలని లేని పక్షంలో ఇక్కడి నుంచి షాపుని తొలగించాలని హామీ ఇచ్చి షాప్ ఓపెనింగ్ ను విరమింప చేశారు. వీధికో వైన్ షాప్ తెరిచి ఈ సమాజానికి ప్రభుత్వం ఏ సందేశం ఇవ్వాలని చూస్తుందో అర్థం కాలేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.