జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : జాతీయ రహదారి 544-డికి సంబంధించి ఎన్.హెచ్.ఏ.ఐ చట్టం ప్రకారం బోడిగానిదొడ్డి గ్రామస్తులకు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రహదారి 544-డికి సంబంధించి బుక్కరాయసముద్రం మండలం బోడిగానిదొడ్డి గ్రామంలో భూ నష్టపరిహారం పంపిణీపై ఆర్బిట్రేషన్ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 544-డి జాతీయ రహదారికి సంబంధించి బుక్కరాయసముద్రం మండలం బోడిగానిదొడ్డి గ్రామంలో సర్వేనెంబర్ 112-2లో 0.60 ఎకరాల భూమికి అవార్డు అయ్యాక నష్టపరిహారం అందించలేదని, గ్రామానికి చెందిన పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఈరోజు సమావేశం నిర్వహించామన్నారు. గ్రామానికి చెందిన భూమి, ఇళ్లు కోల్పోయిన పట్టాదారులతో మాట్లాడి వారికి ఏం కావాలో తెలుసుకొని ఎన్.హెచ్.ఏ.ఐ పిడి, ఆర్డీఓ, తహసీల్దార్ లతో చర్చించి ఎన్.హెచ్.ఏ.ఐ చట్ట ప్రకారం వారికి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఎన్.హెచ్.ఏ.ఐ పిడి తరుణ్ కుమార్, అనంతపురం ఆర్డిఓ జి.వెంకటేష్, బుక్కరాయసముద్రం తహసిల్దార్, సింగనమల సబ్ రిజిస్టర్, బోడిగానిదొడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.