జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : నగరంలోని నడిమివంక, మరువవంకలలో పేరుకుపోయిన చెత్తాచెదరాన్ని పూర్తిగా తొలగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శనివారం రాత్రి నగరంలోని కోర్టు రోడ్ లో ఉన్న గుల్జార్ పేట్ లో (హోటల్ సితార పక్కవీధి) ఫాగింగ్ ప్రక్రియను, కృష్ణ ఎన్క్లేవ్ (పాత కృష్ణ థియేటర్) వద్ద మరువవంకను, సోమనాథ్ నగర్ లోని నడిమివంకను, తపోవనం వద్దనున్న బైపాస్ లో డ్రైనేజీని, నడిమివంకను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని నడిమివంక, మరువవంకలలో వర్షం వచ్చినా ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పిచ్చి మొక్కలు ఉండరాదని, పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. జెసిబిలను ఏర్పాటు చేసి తొలగింపు కార్యక్రమం చేపట్టాలని, పక్కా ప్రణాళిక రూపొందించుకొని పనులు చేయాలన్నారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, ఫాగింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, పబ్లిక్ హెల్త్ డిఎస్ఈ రామ్మోహన్ రెడ్డి, నగరపాలక సంస్థ ఈఈ సూర్యనారాయణ, డిఈలు సుభాష్, రవీంద్రారెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.