అవినీతి, అక్రమాల నియంత్రణలో రాజీ లేదు
ఎక్స్ అఫిషియో మెంబర్ గా దగ్గుపాటి ప్రమాణ స్వీకారం
విశాలాంధ్ర – అనంతపురం : ఎన్నికల ముందు వరకే రాజకీయాలు.. ఇప్పుడు నా జెండా అజెండా అభివృద్ధేనన్నది మీకు ముందే చెప్పానంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్పొరేటర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మేయర్ వసీం అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమవేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి పలు అంశాల పై సూటిగా ప్రశ్నించారు. ముందుగా ఆయన ఎక్స్ అఫిషియో మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దగ్గుపాటి మాట్లాడుతూ డంపింగ్ యార్డులో అవినీతి, ట్రాక్టర్ల కాంట్రాక్టు, కార్మికుల పేరుతో జరుగుతున్న దోపిడీ, స్థలాల ఆక్రమణ వంటి అంశాల గురించి ప్రస్తావించారు. ఒక్కో ట్రాక్టర్ కు ఒకటిన్నర లక్షలు చెల్లిస్తున్నారని.. అదే ప్రైవేటు వారికి ఇస్తే మ్యాన్ పవర్ తో పాటు 70వేలకు వచ్చే అవకాశం ఉందని.. ఆ దిశగా టెండర్లు పిలవాలన్నారు. మొక్కల పెంపకం పేరుతో ఎన్నికలకు ముందు 4కోట్ల రూపాయలు డ్రా చేసినట్టు తెలుస్తోందని.. అయితే మొక్కలు ఎక్కడా కనిపించలేదని.. దీనిపై సరైన విచారణ జరగాలన్నారు. మరోవైపు కాంట్రాక్ట్ వర్కర్లు 6వందల మంది ఉంటే.. వీరిలో 70 నుంచి 80 పనులు చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నారని.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కొందరు కార్పొరేటర్లు నగరంలో సమస్యల మీద ఆందోళన చేస్తామని చెప్పగా.. ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ సీరియస్ గా స్పందించారు. ఇన్నిరోజులు సమస్యలు అలాగే ఉన్నాయి.. అప్పుడెందుకు ఆందోళనలు చేయలేదని ప్రశ్నించారు. నేను ముందే చెప్పానని.. రాజకీయాలు చేయకుండా అభివృద్ధి మీద మాత్రమే ఫోకస్ చేస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.