హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పరిధిలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : రాబోయే రోజుల్లో అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టుపై సంబంధిత ఎస్ఈ, ఈఈలు, డిఈ, ఏఈఈలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పరిధిలో ఇంజనీర్లు ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రణాళిక ప్రకారం పని చేయాలని, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ, హెచ్.ఎల్.సి ఎస్ఈ, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈలు ప్రతినెలా టూర్ డైరీని అందించాలన్నారు. ప్రాజెక్టు పరిధిలో ఏమైనా సమస్యలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. జిల్లా నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ, హెచ్.ఎల్.సి ఎస్ఈ, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈలు ప్రతినెలా హెడ్ ఆఫీస్ కి వెళ్లాలని, జిల్లా సమస్యలను రాష్ట్రస్థాయిలో ప్రస్తావించాలని, అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలన్నారు. అధికారులు హెచ్ఎన్ఎస్ఎస్, హెచ్.ఎల్.సి, మైనర్ ఇరిగేషన్ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులు, కాలువల వివరాలు పూర్తిగా తెలిసేలా గూగుల్ మ్యాప్ తయారు చేసి ఇవ్వాలన్నారు. జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, రిజర్వాయర్లలో చెట్లు, మొక్కల పెంపకానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని, నిపుణులతో సంప్రదించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెట్లు, మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రవహించే పెన్నా రివర్ పరిధిలో గట్లపై మొక్కల పెంపకం చేయాలన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎన్ఎస్ఎస్, హెచ్.ఎల్.సి, మైనర్ ఇరిగేషన్ పరిధిలో జిల్లాలో ఉన్న రిజర్వాయర్లు, కాలువలు, ఆయకట్టు, ఎంతమంది అధికారులు, సిబ్బంది ఉన్నారు, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఎస్డిసి ఆనంద్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ దేశే నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెన్నెల శ్రీను, ఈఈలు రాజస్వరూప్ కుమార్, నారాయణ నాయక్, ప్రతాప్, శ్రీనివాస నాయక్, డిఈఈలు కృష్ణ దాస్ గుప్తా, గురునాథరెడ్డి, ఇతర డిఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.