బోధన పోస్టుల భర్తీపై రూపకల్పన
స్కిల్ డెవలప్మెంట్ సిమెన్స్ శిక్షణ పునరుద్ధరణ
విశాలాంధ్ర- జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో గత ఐదు సంవత్సరాలలో జరిగిన విధ్వంసకాండము వెలుగులోకి తీసుకువచ్చి.. విశ్వవిద్యాలయాన్ని సంస్కరణ దిశగా అడుగులు వేస్తామని ఇన్చార్జి వీసీ హెచ్. ఆచార్య సుదర్శన్ రావు పేర్కొన్నారు. శుక్రవారం విశాలాంధ్ర ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించగా. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయానికి రెండు కళ్ళు.. ఒకటి బోధన, మరొకటి పరిశోధన రెండిటిని ఏకకాలంలో విద్యార్థుల ఉజ్వల భవితకు పునాది వేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలను అనుసరించి విశ్వవిద్యాలయ పోస్టుల భర్తీకి విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న బోధన పోస్టుల భర్తీకి రూపకల్పన చేపట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి నిర్మాణాత్మకమైన నిర్ణయాలను వేగవంతంగా తీసుకుంటామన్నారు. పరిపాలనలో కొత్త ఒరవడిని సృష్టించి.. ఉద్యోగులందరూ ఐక్యతతో విశ్వవిద్యాలయం ప్రగతి వికాసానికి అడుగులు వేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సిమెన్స్ శిక్షణ తో 16,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. త్వరలోనే పునరుద్ధరణ చేసి అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఎంబీఏ కి భవన నిర్మాణం చేపట్టి సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యను పరిష్కరిస్తామన్నారు. బీటెక్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్ మొదలగు కోర్సులను ప్రవేశపెడతామన్నారు. విశ్వవిద్యాలయంలో నిరంతరం పాఠ్యాంశాల బోధన, పరిశోధన, సాంకేతిక అధ్యయనం, పారిశ్రామిక ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, క్రీడలు, సామాజిక సేవ స్ఫూర్తి ను విద్యార్థులకు అందిస్తామన్నారు.