. క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో డయేరియాతో ఏ ఒక్కరూ బాధపడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డయేరియాపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనలను అనుసరించి ఆయా శాఖల జిల్లా అధికారులు వారి శాఖల పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. డయేరియాపై అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు డయేరియా ప్రభావం, ముందస్తు జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై స్టాప్ డయేరియా క్యాంపెయిన్ చేపట్టాలన్నారు. పిల్లలకు డయేరియా సోకకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్ లు నీటి పరిశుభ్రత, నీటి కాలుష్యం, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి డయేరియా కేసులు అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. డయేరియాని అరికట్టేందుకు జిల్లాస్థాయిలో మున్సిపల్ కమిషనర్, జిల్లా పరిషత్ సీఈవో, డిఎంహెచ్ఓ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, డిసిహెచ్ఎస్, ఇతర జిల్లా అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో మెడికల్ అధికారులు అందరూ అనునిత్యం అప్రమత్తంగా ఉండి డయారియా కేసులు, నీటి కాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మెడికల్ అధికారులకు డయారియా గురించి అవగాహన కలిగేలా, జాగ్రత్త చర్యల గురించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని డిఐఓని ఆదేశించారు. పీహెచ్సీలు, సిహెచ్సిలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్ల స్టాక్ అందుబాటులో ఉంచేలా చెక్ చేయాలన్నారు. డయారియాని అరికట్టేందుకు దశలవారీగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని, వాటర్ ట్యాంకులపై మూత వేసేలా చూడాలన్నారు. ఐసిడిఎస్ అధికారులు వారి పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జాతరలు, పెద్ద సంఖ్యలో సమావేశాలు నిర్వహించే స్థలాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పన చూసుకోవాలని సూచించారు. డయేరియా సోకకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మెడికల్ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు వేడి నీళ్లు కాచి తాగే విధంగా విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, డిపిఓ ప్రభాకర్ రావు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పీవిఎస్ఎన్ మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, జిల్లా మలేరియా అధికారి ఓబులు, డిఐఓ యుగంధర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజరావు, డిసిహెచ్ఎస్ డా.పాల్ రవికుమార్, సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన్, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, మైడ్స్ డిడి నాగయ్య, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల మండల, క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.