విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సాధారణ ఎన్నికలు దృష్ట్యా అనంతపురం జేఎన్టీయూలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు త్వరగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాధారణ ఎన్నికలు దృష్ట్యా స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో భవనాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. జేఎన్టీయూలోని ప్రధాన భవనం, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ భవనం, అడ్మినిస్ట్రేషన్ భవనాలను జెసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సమయానికి ఆయా భవనాల్లో కుర్చీలు, బ్యారికేడ్లు, తదితర అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ ఓబుల్ రెడ్డి, తహసిల్దార్ శివరామిరెడ్డి, ఈఆర్ఓ శిరీష, ఉరవకొండ తహసిల్దార్, అనంతపురం సర్వేయర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.