నేషనల్ పార్క్ కు పూర్వ వైభవం తీసుకొస్తా : అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం నగర శివారులో ఉన్న నేషనల్ పార్క్ ను వైసిపి నాయకులు అధ్వానంగా మార్చేశారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం నేషనల్ పార్క్ ను సంబంధిత అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పార్కులో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన చూసి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరా తీశారు. కనీసం టాయిలెట్లు నీటి సౌకర్యం కూడా లేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధ్వానంగా మారిన నేషనల్ పార్క్ స్థలాలను చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ… గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన పాపాన పోలేదన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసినవన్నీ నాశనం చేశారని విమర్శించారు. కచ్చితంగా నేషనల్ పార్కుకు పూర్వ వైభవం తీసుకొస్తామని.. సీఎం చంద్రబాబును కలిసి నిధులు తీసుకొస్తామని ఆయన అన్నారు. నేషనల్ పార్క్ ను కేవలం నగరవాసులు మాత్రమే కాకుండా జిల్లా ప్రజలంతా సందర్శించే విధంగా ఇక్కడ మార్పులు తీసుకొస్తామని దగ్గుపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కూచిహరి, మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ తనయుడు డాక్టర్ ఉమర్, క్లస్టర్ ఇంచార్జ్ డిష్ నాగరాజు, టిడిపి నాయకుడు రాయల్ మధు, డాక్టర్ హరిప్రసాద్, లింగమయ్య స్వామి, బీసీ సెల్ నాయకుడు జోగి రాజేంద్ర, కాటమయ్య, సాదిక్, రహీమ్, దాదాపీర్, ధనమూర్తి, శోభ,శశికళ, కృష్ణమూర్తి, వెంకటేష్, ఆనంద్, అశోక్, ప్రభాకర్, బాబు తదితరులు పాల్గొన్నారు