విశాఖలో టన్ను ధర రూ.1,394, రవాణా ఖర్చు మరో వెయ్యి
దళారులకు, రవాణా సంస్థలకే లబ్ధి
విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: రాష్ట్రంలో ఇసుక బంగారం అయింది. విశాఖ జిల్లాలో నిర్మాణ రంగానికి ఇసుక డిమాండ్ చాలా ఉంది. బిల్డర్లు వందల సంఖ్యలో అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. అభివృద్ధి పనులతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక అవసరం. ఈ జిల్లాకు ఇసుక రీచ్లు లేకపోవడంతో ఇటు శ్రీకాకుళం జిల్లా వంశధార నుంచి, అటు తూర్పు గోదావరి జిల్లా నుంచి గోదావరి ఇసుక తీసుకువచ్చి డిపోల వద్ద నిల్వలు చేసుకోవ లసిన దుస్థితి ఏర్పడిరది. గత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 8 డిపోలు ఏర్పాటు చేసి ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుక అమ్మకాలు నిర్వహించారు. తర్వాత ఆ డిపోలు నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ద్వారా జిల్లాలో అగనంపూడి డిపోలో టన్ను ఇసుక రూ.1,394, భీమిలి డిపోలో రూ.758 కు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. దీనికితోడు లోడిరగ్, రవాణా చార్జీలు అదనంగా వసూలు చేయనున్నారు. గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో నలుమూలలా సమాన దూరంలో ఇసుక డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసింది. రాజమండ్రి, శ్రీకాకుళం నుంచి ఇసుకను సేకరించి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులకు తరలించే ప్రక్రియ చేపట్టింది. ప్రతి రీచ్లో టన్ను ధర సమానంగా నిర్ణయించింది. రీచ్ నుంచి సమీప ప్రాంతాలకు తరలించే ఇసుక ధరలు దూరాన్ని బట్టి రవాణా చార్జీలతో కలిపి ధరలు నిర్ణయించింది. అయితే తాజాగా ప్రభుత్వం కేవలం జిల్లా వ్యాప్తంగా 2 డిపోలను మాత్రమే ఏర్పాటు చేసింది. ఒక్కో యార్డు దగ్గర ఒక్కో ధర నిర్ణయించింది. రవాణా చార్జీలు ఇష్టం వచ్చినట్లుగా ఉండటంతో వినియోగదారులకు తడిసిమోపెడవుతోంది. ఇప్పటివరకు మూడు యూనిట్లు లారీ 9 టన్నుల ఇసుక రూ.12,000 ధరకే ఇంటి వద్దకు చేరేది. ఇప్పుడు అగనంపూడిలో ఒక టన్ను ఇసుక రూ.1,394 లోడిరగ్, అన్ లోడిరగ్ చార్జీలు పేరిట ప్రభుత్వం వసూలు చేస్తుండగా, అక్కడ నుంచి రవాణా చార్జీలు ఒక టన్నుకు రూ.800 నుంచి రూ.1,200 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే 9 టన్నుల ఇసుకకు ప్రభుత్వానికి రూ.12,546 చెల్లించాల్సి వస్తుందని, ఇక రవాణా కోసం మరో 8 వేల నుంచి రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని వినియోగదారులు తెలియజేస్తున్నారు. భీమిలి నుంచి ఇసుక తీసుకువచ్చినా ఇదే పరిస్థితి ఉందని, టన్ను ఇసుక ధర రూ.758గా ప్రభుత్వం నిర్ధారించగా, ఇక్కడ 9 టన్నుల ఇసుక ధర రూ.6,822 అవుతుందని, రవాణా చార్జీలు మధురవాడ ప్రాంతానికి రూ.5 వేలు వసూలు చేస్తుండగా, నగరంలోకి అయితే మరో మూడు వేలు అదనంగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. పేరుకే ఉచితమని, నిజమైన ఇసుక వినియోగదారులకు రవాణా చార్జీలు, లోడిరగ్, అన్ లోడిరగ్ చార్జీలు పేరిట భారంగా మారిందని లబోదిబోమంటున్నారు. మరోపక్క కొంతమంది బడా నేతల అండతో ఇసుక వ్యాపారుల అవతారం ఎత్తి ఎక్కడికక్కడా ఇసుక పోగులు వేసుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని రెండు స్టాక్ యార్డుల వద్దకు ఇప్పటికే వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయి. ప్రతి వాహనదారుడి వద్ద ఎవరెవరివో ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు, చిరునామాలు ఉన్నాయి. వాటిని చూపించి ఇసుక లోడిరగ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. అయితే లారీ డ్రైవర్లు సమర్పిస్తున్న ఆధార్, ఫోన్ నంబర్లు కలిగిన వారికి వాస్తవంగా ఇసుక అవసరమో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ప్రభుత్వం రీచ్ల నుంచి యార్డులకు తరలించడానికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని మాత్రమే వసూలు చేస్తున్నామంటూ ప్రకటించింది. అయితే నిన్నటి వరకు ఇసుక విధానంపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన కూటమి ప్రభుత్వం చివరికి అదే పాలసీని అమలు చేస్తూ ధరలు పెంచేలా భారం మోపుతోంది. మొత్తానికి ప్రభుత్వం ప్రజల కళ్లలో ‘ఇసుక’ కొట్టిందని నిజమైన వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వంలో మైనింగ్ శాఖ పర్యవేక్షణలో రీచ్లో ఇసుక తవ్వి యార్డుల్లో నిల్వ చేసింది. అక్కడి నుంచి వినియోగదారులకు టన్నుల వంతున కొనుగోలు చేసే విధంగా విధివిధానాలు ప్రకటించింది. ఇసుక పాలసీ తెచ్చి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసింది. ఇసుక విక్రయం ద్వారా వచ్చే ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు చేర్చింది.
వర్షాకాలం… కొందరి గుప్పెట్లో ఇసుక కుప్పలు
వర్షాకాలంలో ఇసుక దొరికే అవకాశం లేదు. అందువల్ల టీడీపీ, జనసేన నేతలు ఇప్పటి నుంచే సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం రీచ్ల్లో ఉన్న ఇసుకను మాయం చేసేశారనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ముందునాటికి ప్రతి యార్డులోనూ లక్షల టన్నుల ఇసుక నిల్వలున్నాయి. ఇప్పుడు అగనంపూడి డిపోలో 97,782.36 మెట్రిక్ టన్నులు, భీమిలిలో 94,047 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఉందని అధికారులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆయా యార్డుల్లో రూ.కోట్లు విలువైన ఇసుకను రహస్య ప్రాంతాలకు తరలించేసుకున్నారని, ప్రస్తుతం డిపోలో ఉన్న ఇసుక విక్రయాలు పూర్తయితే రాబోయే వర్షాకాలంలో ఇసుక కొరత ఏర్పడుతుందని నిర్మాణదారులు అంటున్నారు. ఈ సమయంలో దోచుకున్న ఇసుకను అధిక రేట్లకు విక్రయించేలా టీడీపీ నేతలు పన్నాగం పన్నుతున్నారని బిల్డర్లు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఇసుక పేరుతో మరోసారి దోపిడీకి టీడీపీ ప్రభుత్వం తెరతీస్తోందని సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో అత్యధికంగా ఇసుకను వినియోగించే విశాఖ వంటి మహా నగరాలకు ధరలు తగ్గించాలని, అప్పుడే నిర్మాణరంగం మరింత ఊపు అందుకుంటుందని ఇటు వినియోగదారులు, అటు భవన నిర్మాణ కార్మికులు అభిప్రాయపడుతున్నారు.