విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ అధినేత జగన్ను మాజీ మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలు కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ను ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన నేతలు సోమవారం కలిసి ఓటమిపై చర్చించారు. ప్రాంతాల వారీగా నేతలతో జగన్ భేటీ అయ్యారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పుష్పశ్రీవాణి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, గొల్ల బాబూరావు, ఓటమి పాలైన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పరాజయానికి కారణమైన అంశాలపై జగన్ చర్చించారు. ఓటమికి కారణాలపైన, ఓటర్లను ప్రభావితం చేసిన అంశాలపైనా సమీక్షించారు. ఎక్కడ తప్పిదం జరిగిందనీ, వైసీపీని ఓడిరచిన విధానాలేమిటని ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, విధ్వంసాలను జగన్ దృష్టికి నేతలు తీసుకెళ్లారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో కలసి లీగల్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు, కార్యకర్తలకు నేతలు అండగా నిలవాలని సూచించారు. మళ్లీ పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. మాజీ ఎంపీలు వంగా గీతా, బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరయ్యారు.