ఏపీలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘ ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్), జగనన్న సంకల్పం కార్యక్రమాలకు ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 4,097 చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం సీడీని ఆవిష్కరించారు. 100 రోజులపాటు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కొనసాగనుంది. గృహాల్లోనే తడి, పొడి, ప్రమాదకర (నాప్కిన్స్, సూదులు, గ్లౌజ్లు, ఎలక్ట్రికల్) చెత్తను వేరు చేసేలా ప్రతి ఇంటికి మూడు డస్ట్ బిన్ల చొప్పున క్లాప్ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల్లో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 123 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని 40 లక్షల గృహాలకు 1.20 కోట్ల డస్ట్ బిన్లు పంపిణీ చేస్తారు. ఇందుకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చిస్తోంది. జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 1,500 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించనున్నారు. మరింత మెరుగ్గా చెత్త సేకరణ, తరలింపు కోసం 3,097 ఆటో టిప్పర్లు, 1,771 ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయనున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను 5,868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలిస్తారు.చెత్త రవాణా కోసం గ్రామ పంచాయతీలకు 14 వేల త్రిచక్ర వాహనాలు పంపిణీ చేస్తారు.