సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర-తుళ్లూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు వల్ల రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో ఆదివారం రామకృష్ణ మాట్లాడుతూ నాలుగేళ్లుగా 5రాజధాని లేని రాష్ట్రంగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి కల్పించాడని విమర్శించారు. ఒకవైపు విశాఖపట్నం, కర్నూలు అభివృద్ధి చేయకపోగా మరోవైపు అమరావతిలో అభివృద్ధిని చంపేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశారన్నారు. 1286 రోజులుగా ఇక్కడ రైతులు, మహిళలు పోరాటం చేస్తున్నారని.. దానిమీద ఎటువంటి స్పందన లేదన్నారు. అఖిలభారత కిసాన్సభ (ఏఐకేఎస్) అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న రైతుల పోరాటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రైతు సమస్యలపై దిల్లీ సరిహద్దులో ఎంతో వీరోచితంగా రైతులు పోరాడి విజయాన్ని సాధించారని.. నరేంద్ర మోదీ మెడలు వంచి వినాశకర చట్టాలను రద్దు చేయించారని అన్నారు. అదే తరహాలో ఇక్కడ అమరావతి రైతాంగ ఉద్యమం కాలాతీతంగా మిగలదని.. ఇక్కడ రైతులు ఏదైతే రాజధాని సాధించాలని పోరాడుతున్నారో అది కూడా విజయం సాధిస్తుందీ, చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి అమరావతిని రాజధానిగా ప్రకటించి దాని అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.