. 80 మార్కులకే రాత పరీక్ష
. కీలక మార్పులపై విద్యాశాఖ కసరత్తు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి(ఎస్ఎస్సీ) పరీక్ష విధానంలో కీలక మార్పులు చేసే దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. కొత్తగా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో రాత పరీక్షకు 80 మార్కులు, 20 ఇంటర్నల్ మార్కులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్లోని అన్ని పాఠశాలల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్నే అమలు చేస్తున్నారు. విద్యార్థులు తమ పాఠశాలల్లో చదువుతూనే రాష్ట్ర బోర్డు పరీక్షలు రాస్తున్నారు. సీబీఎస్ఈ విధానంలో ఇంటర్నల్ మార్కుల విధానం అమలులో ఉండగా… దానిని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతంలో సీసీఈ విధానంలో ఇంటర్నల్ మార్కులు విధానం అమలులో ఉండగా… అనేక విమర్శలు రావడంతో 2019లో దీనిని రద్దు చేశారు. ఇంటర్నల్ మార్కులను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులకు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకునే అవకాశముంది. దీనిని నియంత్రించేందుకు పటిష్ట విధానాన్ని విద్యాశాఖ రూపొందించనుంది. ప్రస్తుతం పదోతరగతి పరీక్షల్లో సూక్ష్మ, లఘు ప్రశ్నలు 12 ఉంటున్నాయి. వాటికి ఒక్కో దానికి అరమార్కు, తేలికైన 8 ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున కేటాయించారు. వీటిని ఒక్కో మార్కు ప్రశ్నలుగా విద్యాశాఖ మార్పు చేయనుంది. అన్నీ అనుకూలిస్తే ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొత్తం 100 మార్కులకుగాను 80 మార్కులకు రాత పరీక్ష, మరో 20 మార్కులకు ఇంటర్నల్ విధానాన్ని విద్యాశాఖ ప్రవేశపెట్టనుంది. దీనిపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం అమలులోకి తెచ్చింది. ఈ విద్యా సంవత్సరం సీబీఎస్ఈ బోర్డు విధానంలో పదో తరగతి పరీక్షలు రాసే వారికి సరైన బోధన, సామర్థ్యం లేనందున ప్రస్తుత ప్రభుత్వం దానిని రద్దు చేసింది.వారికి కూడా స్టేట్ సిలబస్తోనే పరీక్షలు నిర్వహించనుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలుతోపాటు మొత్తం విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నారు.