వైసీపీ కార్పొరేటర్లపై వల
కర్నూలులో మారుతున్న రాజకీయ సమీకరణలు
విశాలాంధ్ర-కర్నూలు సిటీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కర్నూలు నగరపాలక సంస్థలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అఖండ విజయం సాధించడంతో కర్నూలు మేయర్ పదవిపై ఆ పార్టీ స్థానిక నేతలు కన్నేశారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కర్నూలులో 33, పాణ్యంలో 16, కోడుమూరులో మూడు కలిపి 52 వార్డులు ఉన్నాయి. 2021 మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ44 వార్డులలో విజయం సాధించగా ఆ పార్టీకి చెందిన బీవై రామయ్యను మేయర్గా ఎన్నుకున్నారు. 8 వార్డులలో గెలుపొందిన టీడీపీ… ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకొని మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్నూలు ఎమ్మెల్యే టీజీ నేతృత్వంలో మూడవ వార్డు కార్పొరేటర్ షాజహాన్ పర్వీన్, 6వ వార్డు కార్పొరేటర్ షేక్ నీలోఫర్, 13వ వార్డు కార్పొరేటర్ విజయలక్ష్మి టీడీపీలో చేరారు.ప్రస్తుత మేయర్ బీవై రామయ్యపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే టీజీ భరత్ నేతృత్వంలోని టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్న వైసీపీ వార్డు కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొంతమంది ్ల టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు కేఈ ప్రభాకర్తో ఇప్పటికే టచ్లు ఉన్నట్లు సమాచారం. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే తమ వార్డులో అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది. 22, 17, 30, 38 వార్డులకు చెందిన కార్పొరేటర్లు ఎన్నికల ఫలితాలకు ముందు టీడీపీలో చేరగా, తీర్పు తర్వాత 3, 6, 13 వార్డుల కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్త వారితో టీడీపీ కార్పోరేటర్ల సంఖ్య 8 నుంచి15కు చేరిందని… వీరికి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఎక్స్అఫియో సభ్యులు తోడైతే మెజారిటీ సాధించవచ్చని టీడీపీ నేతలు ధీమాతో ఉన్నారు. జులై చివరి వారంలో నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి ముందే అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ యోచిస్తోంది.ముస్లింల మద్దతు కూడగట్టేందుకు ఎమ్మెల్యే భరత్ ముస్లిం వర్గానికి చెందిన ఒకరికి మేయర్ పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. వైసీపీ కార్పొరేటర్లు జారిపోకుండా మేయర్ బీవై రామయ్య, ఆ పార్టీ నాయకులు కాపాడుకుంటారా? లేక టీడీపీ మేయర్ స్థానాన్ని చేజిక్కించుకుంటుందా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.