. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
. సర్కారు చర్యలు బడులకు శాపం
. మూడేళ్లలో 15 వేలకు తగ్గిన నమోదు
. ప్రతిరోజు 67 వేల మంది గైర్హాజరు
. శాశ్వతంగా మూతబడిన 482 స్కూళ్లు
విశాలాంధ్ర బ్యూరో -ఏలూరు: ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతోంది. పాఠశాలల విలీనం… రద్దు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ… తదితర అంశాలపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. ఉచితంగా షూస్, యూనిఫామ్, టై, బెల్ట్ , నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, అమ్మకు వందనం, టాబ్లు ఇస్తున్నామని చెబుతున్నా… విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉంది. రెండేళ్ల క్రితం చేపట్టిన పాఠశాలల విలీన ప్రక్రియ సర్కారు బడికి శాపంగా మారింది. ప్రాథమిక పాఠశాలలను అర్ధంతరంగా విడగొట్టేశారు. మూడు, నాలుగు, ఐదు తరగతులను సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోగల ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేశారు. దీంతో ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులు బోధించడానికి అధికశాతం మంది ఉపాధ్యాయులు ఉంటున్నారు. కానీ ఆయా తరగతులలో 20 మంది లోపే విద్యార్థులు ఉంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో మూడు , నాలుగు, ఐదు తరగతుల బోధనకు ఉపాధ్యాయులను కేటాయించలేదు. దీంతో ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, 10 తరగతుల బోధనతో పాటు స్కూల్ అసిస్టెంట్లకు మూడు , నాలుగు, ఐదు తరగతుల బోధన అదనపు భారంగా మారింది. మూడు,నాలుగు,ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. కానీ అందుకు సరిపడా ఉపాధ్యాయులను మాత్రం కేటాయించకుండా అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ విధంగా ప్రాథమిక పాఠశాలలను విలీనం పేరుతో విచ్ఛిన్నం చేయడం వలన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఈ కారణంగానే జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య మూడేళ్ల కాలంలో లక్షన్నరకు పైగా పడిపోయింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2023 మేలో ప్రాథమిక పాఠశాలల విలీనానికి ముందు ఎలిమెంటరీ, యూపీ, హైస్కూళ్లు కలిపి 2,677 ఉండేవి. విలీనం తరువాత తర్వాత ప్రాథమిక పాఠశాలలు 185, యూపీ స్కూళ్లు 16, హైస్కూళ్లు 194 కలిపి 2,195కి పడిపోయింది. అంటే విలీనం తర్వాత 482 స్కూళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి అని తెలుస్తోంది.
ఏలూరు జిల్లాలో వివిధ యాజమాన్యాల అజయాయిషీలో గల ఈ పాఠశాలల్లో ఒకటి నుంచి 10 తరగతులలో 2021 -22 లో 2,74,383 మంది విద్యార్థుల హాజరు నమోదయింది. 2022-23లో 2,76,017 మంది, 2023-24లో 2,65,869 మంది విద్యార్థులు చేరారు. ఇక్కడి వరకు గణాంకాలు బాగానే ఉన్నాయి. కానీ మరింత లోతుగా యాజమాన్యాల వారీగా పరిశీలిస్తే… ఏలూరు జిల్లాలోని 2,195 మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ హైస్కూళ్లలో 2021 -22లో 2,72,767 మంది నమోదయ్యారు. 2022-23లో 1,29,959 మంది, 2023-24లో 1,16,931 మంది విద్యార్థులు చేరారు. మున్సిపల్ స్కూళ్లలో… 2021-22లో 31,405 మంది విద్యార్థులు, 2022-23లో 7,878 మంది, 2023-24లో 6,777 మంది విద్యార్థులు నమోదయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో… ఏలూరు జిల్లాలోని 22 ప్రభుత్వ పాఠశాలలో 2021-22లో 6,511 మంది , 2022-23లో 3,706 మంది, 2023-24లో 3,811 మంది విద్యార్థులు ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం ఏలూరు జిల్లాలోని 1,053 ప్రైవేట్ కాన్వెంట్లలో…2021-22లో 2,00,109 మంది విద్యార్థులు, 2022-23లో 1,14,682 మంది, 2023-24 లో 1,45,438 మంది నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిని బట్టి చూస్తే జడ్పీ, మున్సిపల్, రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు గత మూడేళ్ల కాలంలో 15 వేల మందికి తగ్గిపోయిందని తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకం లెక్కల ప్రకారం ప్రతిరోజు 67 వేల మంది విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరవడం ఆందోళన కలిగించే అంశంగా విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ అంశాన్ని ఎలా చక్కదిద్దాలో తెలియక ఉన్నత స్థాయిలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుశాతం పెంచడానికి కంటి తుడుపుగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విద్యారంగ నిపుణులు కోరుతున్నారు. పాఠశాలలు విలీనం రద్దు చేయాలని, బ్రిటిష్ కాలం నుంచి ఉన్న ఎలిమెంటరీ, యూపీ, ఉన్నత పాఠశాల విధానాన్ని కొనసాగించాలి. విద్యార్థుల రోల్తో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. బోధ నేతర పనులను పూర్తిగా నిలిపివేసి ఉపాధ్యాయులను తరగతి గదిలో బోధనకు పరిమితం చేయాలి.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి విద్యా విధానంలో సంస్కరణలు తీసుకొస్తే విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది మెరుగైన సమాజం రూపొందించే దిశగా తయారు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. లేదంటే బడి ఈడు పిల్లలు నిరక్షరాస్యులుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని, కూటమి మేలైన విద్యా విధానం అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆశిస్తున్నారు.