పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
విశాలాంధ్ర బ్యూరో – బాపట్ల : సిద్ధం అంటూ ప్రచారాలు చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమో సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ప్రశ్నించారు. బాపట్ల జిల్లా బాపట్లలో బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పట్టణంలోని చీల్ రోడ్డు సెంటర్ నుంచి జమ్ములపాలెం ఫ్లైఓవర్ వరకు బస్సు యాత్ర నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ జగన్ ఆన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారని, ఎప్పుడూ ప్రజల మధ్యకు రారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వస్తున్నారన్నారు. మళ్లీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా, బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా, ప్రత్యేక హోదాను మళ్లీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా, పూర్తి మద్య నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా, 25 లక్షల ఇళ్లు కడతామని మోసం చేయడానికి సిద్ధమా, రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ మాఫియాకు సిద్ధమా సమాధానం చెప్పాలని నిలదీశారు. మీరు సిద్ధమైతే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేక హోదాపై జగన్ ఆన్న చేతులు ఎత్తేశారని, ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని ఎందుకు ఇప్పటివరకు అడగలేదని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్ బిడ్డ అడుగు పెట్టిందని ఆశీర్వదించాలని కోరారు. పోలవరం, ప్రత్యేక హోదా సాధించే వరకు కొట్లాడుతానని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోదా రాదన్నారు. రాష్ట్రంలో బాబుకి, జగన్కు, పవన్కు ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని ఆమె తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే హోదాపై సంతకం పెడతా అని రాహుల్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అభివృద్ధి లేదు కానీ 8 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం చేశారని అన్నారు. రాజధాని కట్టాలంటే డబ్బు లేదు… రోడ్లు వేయడానికి డబ్బు లేదు… దీనికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, కాంగ్రెస్తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రధాన మంత్రిగా రాహుల్ని చేసుకోవాలని షర్మిల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, బాపట్లను అభివృద్ధి చేసే బాధ్యత తనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, కనుమూరు బాపిరాజు, గంట అంజిబాబు, దేవరాజ్ తదితరులు ఉన్నారు.