. గందరగోళంగా ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్
. 83 మంది విద్యార్థుల పేర్లు గల్లంతు
. మంత్రి లోకేశ్కు అభ్యర్థుల మొర
. సమగ్ర విచారణకు విన్నపం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఏపీ ఈఏపీసెట్ (2024) ఇంజినీరింగ్ విభాగం వెబ్ కౌన్సెలింగ్లో స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ గందరగోళంగా మారింది. మొదటి విడత కౌన్సెలింగ్ సమయానికి స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి ఉన్నత విద్యామండలికి అర్హులైన అభ్యర్థుల జాబితా వెళ్లలేదు. దీంతో మొదటి విడత కౌన్సెలింగ్ సీట్లలో స్పోర్ట్స్ కోటా సీట్లు కలపలేదు. పర్యవసానంగా వందలాది మంది అభ్యర్థుల సీట్లు కోల్పోయారు. దీనికి కారణం శాప్ అధికారుల నిర్లక్ష్యమా? లేక సాంకేతిక సమస్యలా? అనేదీ ఉన్నత విద్యామండలి నిగ్గు తేల్చాలని అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు ఉన్నత విద్యామండలి, శాప్ అధికారుల మధ్య సమన్వయ లోపమున్నట్లు విమర్శలు వచ్చాయి. తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ సమయానికి చేరాల్సిన స్పోర్ట్స్ జాబితా…తుది విడత కౌన్సెలింగ్ నాటికి విడుదల చేయడం, కొందరి పేర్లు తొలగించడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించాలని, సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఏపీ ఈఏపీసెట్ కన్వీనర్ ప్రకటించిన తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఆధారంగా ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రంలో స్పోర్ట్సు రిజర్వుడు అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వారి పత్రాల నమోదుతో మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్కు సిద్ధమయ్యారు. స్పోర్ట్స్ కోటా జాబితా సకాలంలో అందక వారికి చుక్కెదురైంది. చేసేదీఏమీ లేక జనరల్ కేటగిరి కింద వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అదే స్పోర్ట్సు కోటా లభిస్తే మెరుగైన ఇంజినీరింగ్ కళాశాలలు, బ్రాంచీలను ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. రాష్ట్రంలో స్పోర్ట్సు కోటాలో ఇంజినీరింగ్ సీట్లు 609 ఉన్నట్లు సమాచారం. ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్లోకి పేరొందిన తొమ్మిది ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు భాగస్వామయ్యాయి. కన్వీనర్ కోటా కింద ఆయా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్ కోటా వర్తిస్త్తోంది. సీట్లు పొందిన వారిలో అర్హులకు ఫీజు రీయింబర్స్మెంట్ లభిస్తోంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకులు రాని పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులంతా ఏపీఈఏపీసెట్ కౌన్సెలింగ్పైనే ఆధారపడుతుంటారు.
240 పేర్లతోనే సరి!
స్పోర్ట్స్ జాబితాను తొలి విడత కౌన్సెలింగ్కు బదులు రెండో విడత కౌన్సెలింగ్ సమయానికి విడుదల చేయడంతోనే గందరగోళన పరిస్థితి నెలకొంది. 240 మంది పేర్లతో ఈ జాబితా విడుదలైంది. బాస్కెట్ బాల్, రోలర్ స్కేటింగ్, జిమ్నాస్టిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నీస్, చెస్, బాడ్మింటన్, జుడో, రైఫిల్ షూటింగ్, బాక్సింగ్, ఫెన్సింగ్, సాఫ్ట్బాల్, క్రికెట్, హ్యాండ్బాల్ తదితర విభాగాలతో జాబితాను విడుదల చేశారు. అన్ని క్రీడా సంఘాలను భాగస్వామ్యం చేయకపోవడంతో మరో 23 మంది పేర్లు జాబితాలోకి వెళ్లలేదని అభ్యర్థులు తెలిపారు. దీనికి శాప్ నిర్లక్ష్యమే కారణమన్నారు. 23, 24 తేదీల్లోగా జాబితాపై అభ్యంతరాలను తెలిపేందుకు సమయం ఇచ్చారు. కొన్ని అసోసియేషన్లు విద్యార్థుల వివరాలను పంపకపోవడంతో ‘నాట్ అలాటెడ్ ఇన్ స్పోర్ట్స్ కోటా’ అని పొందుపరిచారు. దీనివల్ల 83 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ కోటా కింద ఇంజినీరింగ్ సీటు కోల్పోయే అవకాశముంది.