ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్
విశాలాంధ్ర` మచిలీపట్నం: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులు 10 లక్షల 50 వేల మందికి మూడు వేల కోట్ల 80 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నదన్నారు. కంపెనీ కుట్రలు, కుతంత్రాలతో సమస్య పరిష్కరించకుండా కోర్టు లిటిగేషన్తో కాలం గడిచేలా ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఆస్తులమ్మి రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలన్నారు. బాధితుల డిపాజిట్లు చెల్లించి న్యాయం చేస్తామని టీడీపీ ి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందనీ, ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అనేక అధికార వ్యవస్థలను ధ్వంసం చేసిన నేపథ్యంలో అగ్రిగోల్డ్ విషయం నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పరిష్కరించడానికి ఇంకా చర్యలు చేపట్టలేదని బాధితుల ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన విన్నవించారు. కోర్టు కేసులను వేగంగా పరిష్కరించి, కంపెనీ యజమానులు దాచిన బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకుని సత్వరమే బాధితులకు న్యాయం చేసేటట్లు చూడాలని ముప్పాళ్ల కోరారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే. గగన్, సీపీిఐ సీనియర్ నాయకులు మోదుమూడి రామారావు పాల్గొన్నారు.