విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి రిపోర్టు చేయాలని మరో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీజేసింది. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్కాఫ్ ఎండీ నీలకంఠారెడ్డి, పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథార్టీ ఓఎస్డీ బి.అనిల్కుమార్రెడ్డి, సంప్రదాయ వనరుల కార్పొరేషన్ ఎండీ నంద కిశోర్… ఈ ముగ్గురూ జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే జీఏడీకి సీనియర్ ఐఏఎస్లు వై.శ్రీలక్ష్మి, ప్రవీణ్ప్రకాశ్, రజిత్ భార్గవ్ను రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరు వైసీపీ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారన్న విమర్శలున్నాయి. దాంతోపాటు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన ప్రవీణ్ ప్రకాశ్పై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జీఏడీకి పంపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఏఎస్, ఐపీఎస్ల మార్పులపై దృష్టి పెట్టింది. డీజీపీ, సీఎస్తోపాటు కీలక స్థానాల్లో ఐఏఎస్, ఐపీఎస్లను మార్పు చేశారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పనిచేసి, మళ్లీ కేంద్ర సర్వీసులకు వెళ్లిన వారిని తిరిగి రప్పించే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసు శాఖలో డీజీపీ స్థాయి నుంచి ఏపీ ఇంటిలిజెన్స్, ఏసీబీ విభాగాలను ప్రక్షాళన చేశారు. ఆయా పోస్టుల్లో గతంలో ఉన్న అధికారులను తొలగించారు.