బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. బద్వేల్ ఉపఎన్నిక పోరులో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,12,730 మంది ఓట్లరు ఉండగా, ఇందులో పురుషులు 1,06,650 ఉండగా, మహిళలు 1,06,069 మంది, ఇతరులు 20 ఉన్నారు. పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. బద్దేల్లో ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ తెలిపారు. బద్వేల్ ఉపఎన్నిక ప్రక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా విజయానంద్ పరిశీలిస్తున్నారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే అధికారులు వాటిని మార్చినట్లు తెలిపారు. స్థానికంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
కాగా శుక్రవారం ఉదయం నుంచే జిల్లావ్యాప్తంగా వాన మొదలైంది. బద్వేలు నియోజకవర్గంలోను జోరుగా వర్షం కురిసింది. ఈ వర్షాన్ని లెక్కచేయకుండా పోలింగ్ సిబ్బంది నియోజకవర్గ కేంద్రమైన బద్వేలులోని బాల యోగి గురుకుల పాఠశాలనుంచి 281 పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తరలించారు.జిల్లా ఎన్నికల యంత్రాంగం వర్షాలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ సిబ్బందికి గొడుగులను ఏర్పాటు చేశారు.