ఇండో-పసిఫిక్ దేశాల నేవీ అధికారుల భేటీ
విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కలయికతో విశాఖలో భారత నేవీ నిర్వహించనున్న మల బార్ విన్యాసాలపై ఆయా దేశాల నేవీ అధికారులు గురువారం చర్చించారు. విశాఖలో నేవీ హెడ్ క్వార్టర్స్ వైస్ అడ్మిరల్ కార్యాలయంలో సమావేశ మైన అధికారులు… దేశాల మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం కొనసాగించేందుకు ఈ విన్యాసాలు దోహదపడతాయని తెలిపారు. సముద్రంలోనూ, ఉపరి తలంపైనా నిర్వహించే విన్యాసాలపైన, ఇండో-పసిఫిక్ దేశాల మధ్య జరగనున్న విన్యాసాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పైనా వీరంతా చర్చించినట్టు తెలిసింది. గడిచిన 28 ఏళ్లుగా ఈ ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహించడంతో అన్ని రంగాల్లో సమూల మార్పులు వచ్చాయని, అందుబాటులోకి వస్తున్న సాంకేతిక రంగాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. విశాఖలో వేదికగా మలబార్ 28వ ఎడిషన్ విన్యాసాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల దౌత్య సంబంధాలకు మలబార్-2024 గొప్ప వేదిక అన్నారు. ముఖ్యంగా సముద్ర దొంగల ఘటన సమయంలో ఇండియన్ నేవీ సమర్ధవంతంగా పనిచేసిందని, సాహసోపేతంగా ఎదుర్కొన్నామన్నారు. తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేశ్ పంధార్కర్, యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ స్టెఫెన్ కొహ్లిర్, జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ ఫ్లీట్ సీఎన్సీ కత్సుషి ఒమాచి, ఆస్ట్రేలియన్ ఫ్లీట్ కమాండర్ క్రిస్ స్మిత్ తదితరులు ‘కీ లీడర్షిప్ ఎంగేజ్మెంట్’ అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.