విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో స్వచ్ఛభారత్ కార్మికులు గ్రీన్ అంబాసిడర్స్, క్లాపు మిత్రులకి 12 నెలల వేతన బకాయిలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని స్వచ్ఛభారత్ కమిషనర్ కార్యాలయంలో ఓఎస్డీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ… పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్లు, క్లాపు మిత్రులు 12 మాసాలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నిసార్లు అధికారులను కలిసినా… పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ని కలిసి విన్నదించుకున్నా ఫలితం లేదన్నారు. క్రింది స్థాయిలో పంచాయతీలు శుభ్రంగా ఉన్నాయంటే తడి చెత్త పొడి చెత్త సేకరించి, యంత్రాల వద్ద పనిచేసేవారికి వేతనాలు ఇవ్వకుండా స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎలా నిర్మిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. స్వచ్ఛభారత్ కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ త్వరలో కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.మున్సిపల్ కార్మికులకు త్వరలో వేతన బకాయిలు చెల్లించి… వారికి ఆరోగ్య పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు గోవిందస్వామి పాల్గొన్నారు.